ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, సూపర్ డూపర్ హిట్ సినిమాల దర్శకుడు హరీష్ శంక‌ర్‌ది హిట్ కాంబినేష‌న్‌. వీళ్లిద్దరి కలయికలో 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'డీజే - దువ్వాడ జగన్నాథం' సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి మరోసారి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అయితే... అది సినిమా కాదు, ఓ వెబ్ సిరీస్. దానికి హరీష్ శంకర్ రచయిత. అలాగే, నిర్మాత కూడా! ఈ వెబ్ సిరీస్ కథా కమామీషు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...


హరీష్ శంకర్ రాసిన కథ ఆధారంగా రూపొందుతున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఎటిఎం'. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ రోజు వెబ్ సిరీస్‌ను అధికారికంగా ప్రకటించారు. 'రాబరీ బిగిన్స్ సూన్' (దోపిడీ త్వరలో మొదలు అవుతుంది) అని ఆ పోస్టర్ మీద పేర్కొన్నారు. అలాగే, 'దొంగతనం పక్కా' అంటూ మరో సోషల్ మీడియాలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ ఎటిఎం దోపీడీ ఆధారంగా హరీష్ శంకర్ థ్రిల్లింగ్ కథ రాసినట్టు తెలుస్తోంది. సి. చంద్ర మోహన్ స్క్రీన్ ప్లే రాయడంతో పాటు దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్‌ను 'జీ 5' ఓటీటీ కోసం రూపొందిస్తున్నారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, హరీష్ శంకర్ .ఎస్ నిర్మిస్తున్న ఒరిజినల్ సిరీస్ ఇది.