కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్యర్య విడిపోయారు. ఈ విషయాన్ని ధనుష్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వీరిద్దరికీ 2004లో వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ధనుష్ తమిళంలో ప్రముఖ దర్శక, నిర్మాత కస్తూరి రాజా కుమారుడు. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ ధనుష్‌కు అన్నయ్య.


వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం సంచలనంగా మారిన సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అప్పటినుంచే వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది.


ఐశ్వర్య రజనీకాంత్ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది. వీటిలో మొదటి సినిమా ధనుష్, శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘3’. పదేళ్ల క్రితమే యూట్యూబ్‌ను షేక్ చేసిన ‘వై దిస్ కొలవెరి’ సాంగ్ ఈ సినిమాలోదే. ఆ తర్వాత గౌతమ్ కార్తీక్ హీరోగా ‘వాయ్ రాజా వాయ్’ అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో ధనుష్ కూడా అతిథి పాత్రలో కనిపించాడు. ధనుష్ మాత్రమే కాకుండా ఐశ్వర్య కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడిపోయిన విషయాన్ని ధ్రువీకరించింది.


Also Read: ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఆమేనా?


నాగ చైతన్య, సమంతల తరహాలోనే వీరు కూడా ఒకే లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘18 సంవత్సరాల పాటు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసున్నాం. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, సర్దుకుపోతూ, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ప్రయాణించాం. మా ఇద్దరి దారులు నేడు వేరవబోతున్నాయి. మేం ఒక భార్యాభర్తలుగా విడిపోయి.. వ్యక్తులుగా ఒకరి గురించి ఒకరు మరింత తెలుసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించి మాకు ప్రైవసీని ఇవ్వండి.’ అని ఈ లేఖలో పేర్కొన్నారు.


కొన్ని నెలల క్రితం వీరిద్దరూ ఎంతో క్లోజ్‌గా ఉన్న వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రజనీకాంత్ నటించిన పేట సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఇలమై తిరుంబదే’ పాటను ధనుష్.. ఐశ్వర్య కోసం స్వయంగా పాడటం ఈ వీడియోలో చూడవచ్చు.