మాధవ్ సంగతి రామూర్తికి చెప్పాలని చూసిందని జానకిని మెట్ల మీద నుంచి కిందకి తోసేస్తాడు. తర్వాత ఆమె చేతిలోని తాళి, లగ్నపత్రిక తీసుకుని ఏమి తెలియని వాడిలాగా అమ్మా అని అరుచుకుంటూ వస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ వచ్చి తనని చూసి చాలా కంగారు పడతారు. నా కళ్ల ముందే అమ్మ మెట్ల మీద నుంచి జారీ పడిపోయిందని చెప్తాడు. వెంటనే జానకిని హాస్పిటల్ కి తీసుకుని వస్తారు. జానకిని ఆ పరిస్థితిలో చూసి రామూర్తి అల్లాడిపోతాడు. నాకు అడ్డుగా వస్తే మా అమ్మనే క్షమించలేదు నేనేమీ చెయ్యాలని అనుకుంటున్నానో చూసి మా అమ్మ తప్పు చేసింది అందుకే హాస్పిటల్ పాలైంది. నాకు నువ్వు కావాలి రాధ. నువ్వు ఉంటే ఎవరు వద్దు, అడ్డు పడే వాళ్ళు అసలు వద్దు అని మాధవ్ మనసులో అనుకుంటాడు.


ఆదిత్యకి రుక్మిణి ఫోన్ చేస్తుంది. సత్య పక్కన ఉన్న ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు రుక్మిణి అనేసరికి సత్య వింటుంది. విషయం చెప్పడంతో వెంటనే బయల్దేరతాడు. ఇంట్లో దేవి, చిన్మయి చాలా ఏడుస్తూ ఉంటారు. అవ్వకి ఏమి కాదు మంచిగా అయిపోతుందిలే అని భాగ్యమ్మ సర్ది చెప్పేందుకు చూస్తుంది. హాస్పిటల్ కి వెళ్తామని అంటే వద్దని అంటుంది. దేవుడికి మొక్కారు కదా ఏమి కాదులే పరేషన్ కావొద్దని చెప్తుంది. జానకి తలకి తీవ్రమైన గాయం కావడంతో డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆదిత్య హాస్పిటల్ కి వస్తాడు. ఇక్కడ నీ అవసరం ఎవరికి లేదు మా అమ్మ మంచి చెడు చూసుకోడానికి నేను ఉన్నాను అని ఆదిత్యతో మాధవ్ అంటాడు. నీ పద్ధతి మార్చుకోవా అని రామూర్తి తిడతాడు. వాడి మాటలు పట్టించుకోకండి మా కోసం ఇంట దూరం వచ్చారు చాలా సంతోషంగా ఉంది అని రామూర్తి అంటాడు.


Also Read: తల్లిదండ్రులను చూసిన కార్తీక్,దీపను చూసిన ఆనందరావు - మాయా ప్రపంచంలో మోనిత వెలిగిస్తోన్న 'కార్తీకదీపం'


నేను భయపడినట్టే జరుగుతుంది.. ఆదిత్య నాకు తెలియకుండా అక్కని కలుస్తున్నాడు. చాటుగా అక్కతో మాట్లాడుతున్నాడు. అంటే ఆదిత్య అక్కని ఇంకా మర్చిపోలేదు.. ఆ ప్రేమ ఇద్దరిలో అలాగే ఉంది. అందుకే దేవిని సొంత కూతురిలా చూసుకుంటున్నాడు. అక్క మీద ప్రేమ దేవి మీద చూపిస్తున్నాడు. అయినా అక్క మాధవ్ ని పెళ్లి చేసుకుంది కదా ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది. ఆ రోజు నా మీద ప్రేమతో వెళ్లిపోయిందని అనుకున్నా.. ఆ రోజు వెళ్లకపోయినా ఈరోజు అక్క, ఆదిత్య ఇద్దరు ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేకపోతున్నారా? అందుకే ఆదిత్య నన్ను దూరం పెడుతున్నాడా? అక్క మరొకరి భార్య.. ఈరోజు అక్క కోసం నా కాపురాన్ని నేను ఎందుకు పాడు చేసుకోవాలి. అయినా అక్క నా సొంత అక్క కాదు కదా అలాంటప్పుడు నేను ఇంకా అక్క గురించి ఆలోచించడం ఏంటి? ఇప్పుడు నా కాపురం నిలబెట్టుకోవడానికి నేను చెయ్యాల్సింది నేను చేస్తాను అని సత్య అనుకుంటుంది.


జానకి స్పృహలోకి వచ్చి రాధ రాధ అని కలవరిస్తుంది. నర్స్ వచ్చి ఆమె కళ్ళు తెరిచింది రాధ అని కలవరిస్తున్నారు అని చెప్తుంది. మాధవ్ టెన్షన్ పడతాడు. జానకి మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కానీ బయట నుంచి మాధవ్ బెదిరించడం చూసి ఆగిపోతుంది. సత్య, దేవుడమ్మ ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జానకమ్మకి అలా జరిగింది అంటే వెంటనే అమ్మ వెళ్తాను అంటుంది అక్కడ రుక్మిణిని చూస్తే ప్రమాదం అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. మినిస్టర్ గారి మీటింగ్ పనులు చూడటానికి అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చిందని అబద్ధం చెప్తాడు. ఆదిత్య ఆంటీకి కూడా అబద్ధం చెప్తున్నాడు అంటే అక్క కోసం ఇలా చేస్తున్నాడు, అక్కని కలవడానికి దేవిని అడ్డు పెట్టుకుంటున్నాడా అందుకే దేవి మీద అంత ప్రేమ చూపిస్తున్నాడా అని సత్య ఆలోచనలో పడుతుంది.


Also Read: మాటలతో వసు మనసుకి మరో గాయం చేసిన రిషి, బయటపడిన దేవయాని-సాక్షి కుట్ర!


తరువాయి భాగంలో..


దేవుడమ్మ దేవికి ఫోన్ చేస్తుంది. ఏడుస్తుంటే ఏమైందని అడుగుతుంది. మా అవ్వ మెట్ల మీద నుంచి కిందపడిందని దేవి చెప్పేసరికి దేవుడమ్మ వెంటనే హాస్పిటల్ కి వస్తుంది. హాస్పిటల్ కి వచ్చిన దేవుడమ్మ, ఆదిత్యని దూరం నుంచే చిన్మయి చూసి రాధతో చెప్తుంది.