ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ సినిమాల వైపు పెద్దగా చూసేవారు కాదు. మన దర్శకులు వారిని టాలీవుడ్ కి పరిచయం చేద్దామనుకున్నా.. కోట్ల రెమ్యునరేషన్ చెప్పి షాక్ ఇస్తుండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. బాలీవుడ్ ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే ఉంది. సినిమా డైరెక్టర్ల నుంచి హీరోయిన్ల వరకు అందరూ టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ హీరోలతో కలిసి నటించడానికి మొగ్గు చూపుతున్నారు. 


రీసెంట్ గానే అలియాభట్.. అల్లు అర్జున్ తో కలిసి నటించాలనుందని తన కోరికను బయటపెట్టింది. ఇప్పుడు దీపికా కూడా టాలీవుడ్ హీరోలతో కలిసి నటించాలనుందని చెబుతోంది. ఇప్పటికే ప్రభాస్ తో కలిసి 'ప్రాజెక్ట్ K' సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ.. మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించాలనుందని చెప్పుకొచ్చింది. దీపికా పదుకోన్ నటించిన 'గెహ్రాయియా' సినిమా అమెజాన్ లో విడుదలైంది. 


ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికాకు 'ఇప్పటి వరకు మీరు నటించిన వారు కాకుండా నటించని ఇండియన్ స్టార్స్ లో ఎవరితో మీరు నటించాలని అనుకుంటున్నారు' అని ప్రశ్నించగా.. ఆమె వెంటనే అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల పేర్లు చెప్పింది. ఇప్పుడైతే ఎన్టీఆర్ తో కలిసి పని చేయాలని ఆతురతగా ఉందని.. అపురూపమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ పొగిడేసింది. అల్లు అర్జున్ తో కూడా నటించాలనుందని చెప్పుకొచ్చింది. 


'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎన్టీఆర్ పేరు కూడా నేషనల్ వైడ్ గా మారుమ్రోగిపోతుంది. దీంతో బాలీవుడ్ హీరోయిన్లు సైతం వారితో కలిసి పని చేయాలనుకుంటున్నారు. ఇక దీపికా 'గెహ్రాయియా' సినిమాకి మంచి స్పందన వస్తోంది. మ్యారిటల్ ఎఫైర్స్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ వర్గపు ఆడియన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతోంది.