వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించి.. భారత క్రీడా చరిత్రలోనే అత్యంత గొప్ప అథ్లెట్ లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. 2016 రియో ఒలింపిక్స్ లో ఆమె రజతం సాధించినప్పుడు దేశం మొత్తం ఉద్వేగంతో ఊగిపోయింది. దీని తరువాత సింధుకి పెరిగిన ఆదరణ చూసిన.. ఆమె జీవిత కథను సినిమాగా తీయాలనుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. తన సొంత నిర్మాణ సంస్థలో ఈ బయోపిక్ కోసం పనులు మొదలుపెట్టాడు. దాదాపు రెండేళ్లపాటు స్క్రిప్ట్ వర్క్ జరిగింది. 

 

సింధుతో కలిసి అతడి టీమ్ చాలా కాలం పని చేసింది. ఇక సినిమా మొదలుపెట్టడమే తరువాయి అన్నారు. సింధు పాత్ర పోషించే నటి కోసం వెతుకులాట కూడా మొదలుపెట్టారు. కానీ ఎందుకో ఆ సినిమా పట్టాలెక్కలేదు. కరోనా మొదలయ్యాక సింధు సినిమాను కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. సినిమాల కంటే సోనూ సామాజిక సేవలో బిజీ అవ్వడంతో సింధు సినిమా గురించి మాట్లాడడం మానేశాడు. 

 


 

అయితే ఇప్పుడు సింధు సినిమా చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర పోషించడంతో పాటు సినిమాను నిర్మించడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి తన పాత్రను దీపికా చేస్తే బాగాఉంటుందని సింధు గతంలో ఓసారి చెప్పింది. ఈ మధ్యే టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యంతో మరో పతకాన్ని సంపాదించి తన స్థాయిని మరింత పెంచుకున్న సింధు.. దీపికా, ఆమె భర్త రణవీర్ లను కలిసింది. 

 

సింధుని డిన్నర్ కి ఆహ్వానించిన దీపికా.. అదే సమయంలో సింధు సినిమాపై ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సోనూతో డీల్ క్యాన్సిల్ చేసి తన సినిమాను దీపికా, రణవీర్ ల చేతికి సింధు అప్పగించబోతుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం దీపికా.. షారుఖ్ ఖాన్ నటిస్తోన్న 'పఠాన్' సినిమాలో నటిస్తోంది. అలానే 'సర్కస్' సినిమాలో క్యామియో రోల్ పోషిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీకి హాలీవుడ్ సినిమా ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.