మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్‌, ప్రముఖ నటి మీనా జంటగా తెరకెక్కిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టాయి. అంతే కాదు.. ఈ సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా అద్భుత విజయాలను అందుకున్నాయి. దృశ్యం-2 తర్వాత కొనసాగింపు ఉండదని సినీ అభిమానులు భావించారు. కానీ తాజాగా క్రేజీ న్యూస్ చెప్పారు ఈ సినిమా దర్శక నిర్మాతలు. ఈ సిరీస్‌లో మూడో సినిమాపై కొద్ది రోజులగా వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టారు. తాజాగా జరిగిన ఓ సినీ వేడుకలో ‘దృశ్యం-3’ సినిమా రాబోతున్నట్లు నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌ ప్రకటించారు. ప్రేక్షకుల్ల మరింత ఆసక్తిని రేకెత్తించారు.  


అద్భుత విజయాన్ని అందుకున్న దృశ్యం


వాస్తవానికి.. విజయం సాధించిన సినిమాకు సీక్వెట్ మూవీ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొలి సినిమా మంచి విజయం సాధించడంతో వచ్చే సినిమా మీద జనాల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. అందుకే సీక్వెల్‌గా వచ్చిన చాలా సినిమాలు అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. కొన్ని సినిమాల మాత్రమే ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. అవే మరోసారి హిట్ కొడతాయి. అలాంటి సినిమాల లిస్టులో చేరుతుంది ‘దృశ్యం’ సినిమా. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో మోహన్ లాల్ హీరోగా మీనా హీరోయిన్‌గా జీతూ జోసెఫ్ దర్శకత్వం మలయాళంలో ఈ సినిమా తెరకెక్కింది. మంచి థ్రిల్లింగ్ సబ్జెక్టును కలిగి ఉన్న ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లోకి ఈ సినిమా రీమేక్ అయ్యింది. అన్ని చోట్లా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.


తొలి సినిమాను మించి విజయం సాధించిన దృశ్యం-2  


దృశ్యం సూపర్ హిట్ కావడంతో.. సీక్వెల్‌గా దృశ్యం-2 సినిమా తీశారు. ఈ సినిమా తొలి చిత్రంతో పోల్చితే మరితం సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ప్రేక్షకులు ఈ సినిమాకు సైతం బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు. తొలి సినిమా మాదిరిగానే ఇది కూడా చాలా సినిమాల్లోకి రీమేక్ అయ్యింది. అక్కడ కూడా సూపర్ హిట్ అందుకుంది.  అయితే రెండో భాగంలో సినిమా కథ ముగింపు పలికినట్లుగానే చూపించారు దర్శకుడు. ప్రేక్షకులు సైతం మరో సినిమా ఉండదనే భావించారు. కానీ కొద్ది రోజులుగా సినీ సర్కిల్స్ లో మరో సీక్వెల్ ఉంటుందనే టాక్ వినిపించింది. అనుకున్నట్లుగానే దర్శక నిర్మాతలు మరో పార్ట్ తీయబోతున్నట్లు ప్రకటించారు. సినీ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచారు.  


త్వరలో సెట్స్ మీదకు దృశ్యం-3


సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకి మరో సీక్వెల్ ప్రకటించడం, ఈ సినిమాకు కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనుండటంతో సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్ట్ -3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్తున్నారు. అటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మూడో భాగంలో దర్శకుడు ఎన్ని ట్విస్టులు ఇస్తాడో? ఏమో? అని సినీజనాల్లో చర్చ జరుగుతున్నది.