రామాయణ మహాకావ్యాన్ని సినిమాగా తెరకెక్కించేందుకు సౌత్ తో పాటు నార్త్ లోను చాలా మంది దర్శకులు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరో రామాయణం సినిమా రాబోతోంది. నిజానికి ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఇతిహాసాల ఆధారంగా 'ఆదిపురుష్' సినిమాని తెరకెక్కించారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇందులో శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే బాలీవుడ్ నుంచి మరో దర్శకుడు నితీష్ తివారి రామాయణం ఆధారంగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాలీవుడ్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇక నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా ఆలియా భట్ నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టులో కే జి ఎఫ్ హీరో యశ్ కూడా భాగమవుతున్నట్లు తెలిసింది.


అంతేకాదు యష్ ఈ ప్రాజెక్టులో రావణుడి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం యశ్ ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. రామాయణంలో రావణుడి క్యారెక్టర్ అంటే అందులో కచ్చితంగా నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఓ విధంగా అది ఒక విలన్ రోల్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం తాను ఉన్న స్థాయిలో నెగిటివ్ రోల్ చేయడం ఇష్టం లేక రావణాసురుడి పాత్రలో నటించడానికి తాను సుముఖంగా లేనని నితీష్ తివారి టీం కి యష్ చెప్పినట్లు కన్నడ ఇండ్రస్ట్రీ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ వార్తలపై యశ్ నుంచి కానీ ఆయన టీం నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ ని సంప్రదించారు. అయితే హృతిక్ రోషన్ 'వార్ 2'  షూటింగ్ తో బిజీగా ఉండడంవల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఇక 'కే జి ఎఫ్' సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు యశ్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన 'కే జి ఎఫ్ 1' బ్లాక్ బస్టర్ అందుకోగా.. గత ఏడాది విడుదలైన 'కేజీఎఫ్ 2' బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.


ప్రపంచవ్యాప్తంగా 'కేజీఎఫ్2' మూవీ సుమారు రూ.1100 కోట్ల గ్రాస్ ని అందుకొని సరికొత్త రికార్డ్ ని నెలకొల్పింది. అయితే 'కేజీఎఫ్2' తర్వాత ఇప్పటి వరకు తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు యశ్. ఫ్యాన్స్ అంతా యశ్ నెక్స్ట్ మూవీ ఏ డైరెక్టర్ తో చేస్తాడని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే యష్ నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే ఉంటుందని, అదికూడా 'కేజీఎఫ్' పార్ట్ 3 అంటూ ఇప్పటికే వార్తలు రావడం జరిగింది. మేకర్స్ కూడా 'కేజీఎఫ్2' కి కొనసాగింపుగా 'కేజీఎఫ్3' ఉంటుందని ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడూ స్టార్ట్ అవుతుందో చెప్పలేదు. ఇక బాలీవుడ్ రామాయణం విషయానికొస్తే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ విజువలైజేషన్ పూర్తయినట్టు తెలుస్తోంది. అంతేకాదు రణబీర్ కపూర్ కి కూడా రాముడి పాత్రకి సంబంధించి లుక్ టెస్ట్ చేసినట్లు సమాచారం. నితీష్ తివారి, మధు మంతెన, నమిత్ మల్హోత్రా కలిసి ఈ సినిమా గురించి చర్చలు జరుపుతున్నారట.  వచ్చే దీపావళికి ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.