Gangs of Godavari: మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఇందులో డీజే టిల్లు ఫేం నేహా శెట్టి హీరోయిన్‌ గా నటిస్తుండగా.. తెలుగమ్మాయి అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. 'ఛల్ మోహన్ రంగ' ఫేం కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అంజలి పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. 


నేడు మహిళా దినోత్సవం సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ నుంచి అంజలి క్యారక్టర్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో అంజ‌లి తన లేడీ గ్యాంగ్ తో కలిసి క‌త్తి ప‌ట్టుకుని, కుర్చీ మీద కాలు పెట్టి నిల్చొని ఉంది. ఆమెతో పాటుగా మిగతా ఆడవాళ్లు అందరూ చేతుల్లో ఆయుధాలు పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తూ ఉన్నారు. చూస్తుంటే వీరంతా ఎవరి మీదనో దాడి చేయడానికి రెడీ అయ్యారని అర్థమవుతోంది. 






'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' సినిమాలో అంజలి మెయిన్ హీరోయిన్ కానప్పటికీ, కథను మలుపు తిప్పే కీ రోల్ లో కనిపిస్తుందని తెలుస్తోంది. అయితే ఆమె ఒక వేశ్య పాత్ర పోషిస్తోందనే వార్తలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన పోస్టర్ థీమ్ చూస్తుంటే, అది నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఎన్నో రకాల వైవిద్యమైన పాత్రలతో అలరించిన నేచురల్ బ్యూటీ.. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ లోనూ ఆకట్టుకుంటుందని ఇన్సైడ్ టాక్. ఇది ఆమె కెరీర్ లో గుర్తుండి పోయే మంచి పాత్ర అవుతుందని అంటున్నారు.


నిజానికి 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' సినిమా ఈరోజు (మార్చి 8) మహా శివరాత్రి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. అయితే అనుకోని కార‌ణాల వ‌ల్ల ఈ మూవీ వాయిదా పడటంతో, దాని ప్లేస్ లో విశ్వక్‌ సేన్ నటించిన 'గామి' సినిమాను విడుదల చేసారు. అందుకే ఈరోజు అంజలి పోస్టర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.


గోదావరి బ్యాక్ డ్రాప్‌లో సాగే పొలిటికల్ విలేజ్ డ్రామాగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో విశ్వక్ సేన్ కోనసీమ కుర్రాడిగా సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇందులో గోపరాజు రమణ, హైపర్ ఆది. ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. అమిత్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ సినిమాకి నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. గాంధీ నడికుడికార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 


ఇకపోతే అంజలి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రంతో పాటుగా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' అనే సినిమాలో నటిస్తోంది. ఇది ఆమె కెరీర్ లో మైలురాయి 50వ చిత్రం. 'గీతాంజలి' సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ.. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: WOMEN'S DAY SPECIAL PLAYLIST: మహిళల గొప్పదనాన్ని వివరించే ఈ పాటలు విన్నారా?