రాజమౌళి ట్రెండ్ సెట్టర్. 'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్ మీద తన ముద్ర వేశారు. హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు తీసే సత్తా దక్షిణాది దర్శకులకు ఉందని నిరూపించారు. 'బాహుబలి: ది కంక్లూజన్'తో బాక్సాఫీస్ ఇండస్ట్రీ హిట్ తీసే సత్తా మనకూ ఉందని చాటి చెప్పారు. రాజమౌళి తర్వాత ఆయన బాటలో చాలా మంది నడిచారు. రెండు పార్టులుగా కథలు చెప్పడం నుంచి పాన్ ఇండియా మార్కెట్ మీద గురి పెట్టడం వరకు ఆయన్ను ఫాలో అయిన దర్శకులు ఉన్నారు. మరి రెండు పార్టులను ఒక్క సినిమాగా విడుదల చేసే విషయంలోనూ ఆయన్ను ఫాలో అవుతారా?
రెండు పార్టులను ఒక్కటిగా చేసే కొత్త ట్రెండ్'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్'... రెండు భాగాలుగా ఒక్కటిగా చేసి 'బాహుబలి: ది ఎపిక్'గా ఒక్క సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాహుబలి మొదటి భాగం విడుదలై పదేళ్లు పూర్తైన సందర్భంగా అక్టోబర్ 31న 'బాహుబలి: ది ఎపిక్' విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రెండు పార్టులను ఒక్కటి చేయడం అనే సరికొత్త ట్రెండ్కు దర్శక ధీరుడు శ్రీకారం చుట్టారు. మరి, ఈ బాటలో నడిచేది ఎందరు?
'బాహుబలి' తర్వాత 'కేజీఎఫ్' వచ్చే ఛాన్స్ ఉందా?'బాహుబలి' తర్వాత రెండు పార్టులుగా వచ్చిన కథలు కొన్ని ఉన్నాయి? ఓ కథతో రెండేసి సినిమాలు తీసిన దర్శకులు కొందరు ఉన్నారు. అయితే ఆ స్థాయిలో విజయం సాధించిన సినిమా, వసూళ్ళు రాబట్టిన సినిమా 'కేజీఎఫ్'.'కేజీఎఫ్'తో కన్నడ కథానాయకుడు, రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా హీరోగా అవతరించారు. ఆ సినిమా దర్శకుడు మన తెలుగోడు... ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్' మూడో పార్ట్ కూడా అనౌన్స్ చేశారు. ప్రభాస్ హీరోగా 'సలార్' తీశారు. దానికి రెండో పార్ట్ ఇంకా రాలేదు. మరి, 'కేజీఎఫ్' రెండు పార్టులను ఒక్కటిగా విడుదల చేస్తారా?
'బాహుబలి: ది ఎపిక్' అనౌన్స్ చేసిన తర్వాత రాజమౌళి ఏయే ఎపిసోడ్స్ కట్ చేస్తారు? రన్ టైమ్ ఎలా తగ్గిస్తారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకులలో నెలకొంది. ఎందుకంటే... యాక్షన్ సీక్వెన్సులను కట్ చేయడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం కనుక. 'కేజీఎఫ్'కు కూడా సేమ్ ప్రాబ్లమ్ రావచ్చు. అందులోనూ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అయ్యాయి. రెండు పార్టులకు కత్తెర వేసి ఒక్కటిగా తీసుకు వచ్చే టాస్క్ ప్రశాంత్ నీల్ టేకప్ చేస్తారో? లేదో?
'బాహుబలి' రికార్డులు బ్రేక్ చేసిన పుష్ప సంగతి?'బాహుబలి', 'కేజీఎఫ్' తర్వాత రెండు పార్టులుగా వచ్చి పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన సినిమా 'పుష్ప'. మొదటి భాగంలో నటనకు గాను ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. రెండో పార్టు అయితే పాన్ ఇండియా బాక్సాఫీస్ బరిలో రికార్డులు క్రియేట్ చేసింది. మూవీ ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసిన లెక్కల ప్రకారం అయితే 'బాహుబలి'ని బీట్ చేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 1200 నుంచి 1300 కోట్ల రూపాయలు మాత్రమే.
'పుష్ప' వసూళ్ల మీద విమర్శలు పక్కన పెడితే... ఆ సినిమాలకు ప్రేక్షకాదరణ వచ్చిన మాట వాస్తవం. మరి, ఆ రెండు పార్టులను ఒక్కటిగా చేసి విడుదల చేసే టాస్క్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ టేకప్ చేస్తారా? అన్నట్టు... ఆయన కూడా మూడో పార్ట్ అనౌన్స్ చేశారు. అది ఎప్పుడో వస్తుందో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఆ దర్శకులు రెండు పార్ట్స్ చేసి తప్పు చేశారా?ఇటు తెలుగు, అటు హిందీ... రెండు భాషల్లోనూ ప్రేక్షకులలో మంచి గౌరవం ఉన్న దర్శకుడు మణిరత్నం. చోళుల చరిత్రను 'పొన్నియన్ సెల్వన్'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తమిళంలో తప్ప మిగతా భాషల్లో ఆ సినిమా అంతగా ఆడలేదు. 'జయం' రవితో పాటు మిగతా క్యారెక్టర్ల పేర్లతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారు. మరి, ఒక్క పార్టుగా 'పొన్నియన్ సెల్వన్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే బావుంటుందని మణిరత్నం అభిమానుల ఆశ.
ఎన్టీఆర్ బయోపిక్ విషయంలోనూ నిడివి ఎక్కువైందని కొందరి నుంచి విమర్శ వచ్చింది. ఫస్ట్ పార్ట్ విషయంలో ఆ విమర్శ ఎక్కువ వచ్చింది. ఎన్టీఆర్ సినిమా ప్రయాణం కంటే రాజకీయ ప్రయాణంతో కూడిన సెకండ్ పార్ట్ అందరితో హిట్ అనిపించుకుంది. విజయం సాధించింది. 'ఎన్టీఆర్: కథానాయకుడు', 'ఎన్టీఆర్: మహానాయకుడు'... రెండిటినీ క్రిష్ ఒక్కటి చేస్తారా? కాలమే సమాధానం చెప్పాలి.
హిందీలో 'గోల్ మాల్', 'ధూమ్', 'హౌస్ ఫుల్', 'స్త్రీ' ఫ్రాంచైజీలు వచ్చాయి. అయితే కథల మధ్య కనెక్షన్స్ ఉన్నాయ్ కానీ ఆయా సినిమాల కథలను ఒక్కటి చేయలేం. రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర', ఎన్టీఆర్ 'దేవర', రిషబ్ శెట్టి 'కాంతార', ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' - 'సలార్'కు సీక్వెల్స్ రావాల్సి ఉంది.