Viva Harsha Emotional: ఈరోజుల్లో సోషల్ మీడియా నుండే ఎంతోమంది యాక్టర్స్ పుట్టుకొస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లాంటివి చేసి వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ షార్ట్ ఫిల్మ్స్‌కు అంతగా ఆదరణ లేని రోజుల్లోనే తన స్నేహితులతో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్ హర్ష జీవితాన్నే మార్చేసింది. ‘వైవా’ అనే టైటిల్‌తో వచ్చిన యూట్యూబ్ కంటెంట్‌తో టాలీవుడ్‌లో కమెడియన్‌గా ఎంట్రీ ఇవ్వగలిగాడు హర్ష. ప్రస్తుతం తన పేరు కూడా వైవా హర్షగా మారిపోయింది. ఇక తను మొదటిసారి లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రమే ‘సుందరం మాస్టర్’. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సుల కోసం ‘సుందరం మాస్టర్’ టీమ్ ఆయనను కలవగా.. చిరు మాటలకు హర్ష ఎమోషనల్ అయ్యాడు.


మీరు ఒక లెజెండ్..


‘సుందరం మాస్టర్’ ట్రైలర్‌ను చూపించడం కోసం మూవీ టీమ్ అంతా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరంజీవిని నేరుగా కలిసి విషయాన్ని హర్ష.. తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. చిరును కలిసిన అనుభవం గురించి కూడా తను చెప్పుకొచ్చాడు. ‘‘ఇంతకంటే ఏం కావాలి? ఆ క్షణం నిజంగా జరిగింది. ఆయన పక్కన కూర్చోవడమే నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. సార్ చెప్పింది విన్న తర్వాత యాక్టర్‌గా ఇంతకంటే ఏం కావాలి అనిపించింది. మీరు ఒక లెజెండ్, మీకు చాలా థ్యాంక్స్. మీరు చేసినదానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు హర్ష. ఇందులో చిరంజీవి చెప్పిన మాటలకు హర్ష ఎమోషనల్ కూడా అయ్యాడు.






ఏ సపోర్ట్ లేకుండా..


‘‘ఇలాంటి సినిమాలు మరెన్నో మీరు చేయాలి. మరెంతో భవిష్యత్తు మీకు ఉండాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నువ్వు గానీ, నా జనరేషన్‌లో నేను గానీ మనం ఎవరి అండాదండా లేకుండా వచ్చినవాళ్లం. కేవలం సబ్జెక్ట్‌ను నమ్ముకొని ఉన్నాం. అలాగే ప్రేక్షకులు కూడా సబ్జెక్ట్, కంటెంట్ బాగుండి మనం వాళ్లను అలరిస్తే కచ్చితంగా విజయం లభిస్తుంది. నువ్వు ఈ ఇండస్ట్రీలో సుస్థిరమైన, పటిష్టమైన స్థానం సంపాదించుకోవాలి. నువ్వు, నీతో పాటు నిన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్ మంచి స్థాయికి రావాలి. ఇలాంటి ఔత్సాహికులు, కొత్తదనం, కొత్త తరం వచ్చినప్పుడే ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది’’ అని హర్షను ప్రోత్సహించి మాట్లాడారు చిరంజీవి.


ప్రమోషన్స్‌లో బిజీ..


ఇక మెగాస్టార్ చిరంజీవి అన్న మాటలను ఆయన కాళ్ల మీద పడడంతో పాటు ఎంతో ఎమోషనల్ కూడా అయ్యాడు వైవా హర్ష. ఇక ‘సుందరం మాస్టర్’ అనే సినిమా మొత్తం ఆదివాసీలు, అక్కడి వారి జీవన శైలి నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కింది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షకు జంటగా దివ్య శ్రీపాద నటించింది. ఫిబ్రవరీ 23న ‘సుందరం మాస్టర్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా విడుదలయిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ మూవీని ఎలాగైనా ఎక్కువమంది ప్రేక్షకులకు తెలిసేలా చేయాలని మేకర్స్ బిజీ బిజీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.


Also Read: తెలుగు హీరోల ప్రవర్తన అలా ఉంటుంది - టాలీవుడ్‌పై రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్