నటికిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) వ్యవహార శైలి, స్టేజిపై ఆయన మాటలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇటీవల ఆయన మరోసారి నోరు జారారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, వెండితెర వేల్పుగా తమిళ ప్రజలు భావించే ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కత్తి కాంతారావు మీద ప్రశంసలు కురిపించే క్రమంలో ఎంజీఆర్ను తక్కువ చేసి మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ మీద తమిళ ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఈ విషయంలో విశాల్ స్పందించారు.
గౌరవనీయులైన రాజేంద్ర ప్రసాద్ గారికి...హీరో విశాల్ వ్రాయునది, వ్రాసినది ఏమనగా?''ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగు సినిమా పరిశ్రమలోని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చూసి షాక్ అయ్యాను. ఆయన తీరు చూసి విసుగు చెందాను'' అని విశాల్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో రాసుకొచ్చారు.
''డియర్ రాజేంద్ర ప్రసాద్ గారు... మీపై అత్యంత గౌరవంతో, అదే సమయంలో భారమైన హృదయంతో చెబుతున్నది ఏమనగా? తమిళనాడులో దిగ్గజ నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా పేరు పొందిన మన దివంగత దిగ్గజ నటుడు ఎంజీఆర్ గురించి మీరు చేసిన ప్రసంగాన్ని ఖండిస్తున్నాను. మరో దిగ్గజ నటుడు శ్రీ కాంతారావు గారు గురించి మీరు చేసిన ప్రసంగం బావుంది. కానీ మరొక దిగ్గజ నటుడు ఎంజీ రామచంద్రన్ గారిని కించపరచడం తగదు. ఆయన్ను ఆరాధించే ప్రజల మనోభావాలను గాయపరచడం మంచిది కాదు. ఈ సమయంలో ఏది తప్పనిసరి, ముఖ్యమైనదో మీకు బాగా తెలుసు. ఈ వివాదానికి మీరు ముగింపు పలకాలని అభ్యర్థిస్తున్నాను. మీరు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాను. ఎవరైనా మీ స్థాయి నటుల గురించి భవిష్యత్తులో ఎవరొకరు చెడుగా మాట్లాడితే... నటుడిగా నేను కూడా అలాగే చేస్తాను కాబట్టి మీరు ఈ విషయంపై క్షమాపణ చెబుతున్నారని చెప్పడానికి సారీ చెబుతున్నాను. మిమ్మల్ని ఆ దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను'' అని ట్వీట్ చేశారు.
రాజేంద్ర ప్రసాద్ మీద తమిళ నిర్మాతలు, దర్శక రచయితలు - నటులు కొందరు విరుచుకుపడ్డారు. అయితే... తెలుగు వాడు అయినప్పటికీ తమిళ చిత్రసీమలో హీరోగా ఎదగడంతో పాటు అక్కడ ప్రజల మనసులు గెలుచుకున్న విశాల్ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
