Virat Kohli Most Valued Celebrity In India: టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో పరుగుల వరద పారించడమే కాకుండా, తన ఆస్తులను వెనుకేసుకోవడంలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా భారత్ లో అత్యంత విలువైన సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సెలబ్రిటీల బ్రాండ్ వాల్యుయేషన్ క్రోల్ విడుదల చేసిన లేటెస్ట్ నివేదిక(2023)లో ఈ విషయాన్ని వెల్లడించింది. బాలీవుడ్ స్టార్ హీరోలు రణవీర్ సింగ్, షారుఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టి మరీ ఆయన ఈ ఘనత దక్కించుకున్నాడు.


ఇంతకీ విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?


క్రోల్ తాజా రిపోర్టులో కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూను 227.9 మిలియన్ అమెరికన్ డాలర్లుగా వెల్లడించింది. అంటే.. భారత కరెన్సీలో సుమారు రూ. 1900 కోట్లు. గత ఏడాది(2022)తో పోల్చితే కోహ్లీ ఆస్తుల విలువ ఏకంగా 29 శాతం పెరిగినట్లు తెలిపింది.


రణవీర్ సింగ్, షారుఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టిన కోహ్లీ


ఇప్పటి వరకు అత్యంత విలువైన సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ దిగ్గజ హీరోలు రణవీర్ సింగ్, షారుఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టి మరీ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. రణవీర్ సింగ్ ఆస్తుల విలువ 203.1 మిలియన్ అమెరికన్ డాలర్లు.. భారత కరెన్సీలో సుమారు రూ. 1700 కోట్లు. ఇక షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ 120.7 మిలియన్ అమెరికన్ డాలర్లు.. భారత కరెన్సీలో సుమారు రూ.1000 కోట్లు. నిజానికి ఈ లిస్టులో 2017 నుంచి టాప్ ప్లేస్ లో కొనసాగిన కోహ్లీ, 2022లో మాత్రం రెండో స్థానంలో నిలిచాడు. మొత్తం ఆరు సార్లు భారత్‌ లో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.   


క్రికెటర్లలో కోహ్లీ తర్వాతి స్థానంలో ధోనీ, సచిన్


అత్యంత విలువైన భారత సెలబ్రిటీల లిస్టులో క్రికెటర్లలో విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నిలిచారు. ధోనీ 95.8 మిలియన్ అమెరికన్ డాలర్లు.. భారత కరెన్సీలో సుమారు రూ. 800 కోట్లను కలిగి ఉన్నాడు. 91.3 మిలియన్ అమెరికన్ డాలర్లు, భారత కరెన్సీలో సుమారు రూ. 750 కోట్లతో ఆ తర్వాతి స్థానంలో సచిన్ నిలిచాడు. 


తాజా టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ విఫలం


తాజాగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ దారుణం విఫలం అయ్యాడు. లీగ్ దశలో ఏమాత్రం రాణించలేకపోయాడు. అమెరికాలో పిచ్ ల మీద ఆయన డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోవడం విశేషం. వరుసగా మూడు మ్యాచులలో సింగిల్ డిజిట్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇప్పటి వరకు ఓపెనర్ గా రాని కోహ్లీ.. తాజా వరల్డ్ కప్ లో ఓపెనర్ గా వస్తున్నాడు. అలవాటు లేని ప్లేస్ లో వచ్చి నిలదొక్కుకోలేకపోతున్నాడు. కోహ్లీ పెద్దగా రాణించలేకపోయినా టీమిండియా సూపర్ 8కు క్వాలిఫై అయ్యింది. తర్వాతి మ్యాచ్ లన్నీ వెస్టిండీస్ లో జరగనున్నాయి. అక్కడైనా కోహ్లీ చక్కటి ఆటతీరుతో రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.   


Read Also: కోట్ల విలువైన బంగళా, విలాసవంతమైన కార్లు- ‘యానిమల్’ బ్యూటీ నికర ఆస్తుల విలువెంతో తెలుసా?