Vijay Deverakonda Clarified About Tribal Comments In Retro Event: ట్రైబల్స్‌ను అవమానించారంటూ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై (Vijay Deverakonda) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. దీనిపై విజయ్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఎవరినీ బాధించడం తన ఉద్దేశం కాదని తెలిపారు. 

'యూనిటీ అనేదే లక్ష్యం'

ఏ సమాజాన్ని, ముఖ్యంగా మన షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ను బాధ పెట్టడం, లక్ష్యంగా చేసుకోవడం తన ఉద్దేశం కాదని విజయ్ దేవరకొండ తాజాగా స్పష్టం చేశారు. 'రెట్రో ఆడియో లాంచ్ ఈవెంట్‌లో నేను చేసిన కామెంట్స్ కొంతమంది ప్రజల్లో ఆందోళన కలిగించిందని నా దృష్టికి వచ్చింది. దీనిపై నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఎవ్వరినీ ఉద్దేశపూర్వకంగా హర్ట్ చేయాలని అలా మాట్లాడలేదు. నేను వారిని ఎంతో గౌరవిస్తాను. మన దేశ సమగ్రతలో భాగంగా భావిస్తాను.

నేను యూనిటీ గురించి మాట్లాడాను. భారతదేశం ఎలా ఒకటి, మన ప్రజలు ఒకటి, మనం ఎలా కలిసి ముందుకు సాగాలి అనే దాని గురించి  మాత్రమే కామెంట్ చేశాను. ఏ ఒక్కరినీ కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా అలాంటి కామెంట్స్ చేయలేదు. నేను ట్రైబల్స్ అనే పదం వేరే సెన్స్‌లో వాడాను. నేను ఎప్పుడూ ఎవరిపైనా ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబసభ్యులు, సోదరులే అని భావిస్తాను. నా కామెంట్స్ వల్ల ఎవరైనా బాధ పడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి గురించి మాట్లాడడమే నా ఏకైక లక్ష్యం.' అని అన్నారు.

Also Read: మొదటి రోజు 43 కోట్లు... రెండో రోజు నాని 'హిట్ 3' కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఆ పదం అందుకే వాడాను

తాను ట్రైబల్స్ అనే పదం వేరే సెన్స్‌లో వాడానని విజయ్ దేవరకొండ అన్నారు. 'హిస్టారికల్, డిక్షనరీ సెన్స్‌లోనే నేను ఆ పదాన్ని వాడాను. వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. ఆ సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. అసలు నాగరికత మొదలు కాక ముందు క్లాన్స్, రాజ్యాలు అంటూ ఉండేవి. అంతే తప్ప షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించడం మొదలుపెట్టిన తర్వాత ఇలా వర్గీకరణ అనేది జరిగింది. అలా జరిగి కనీసం 100 ఏళ్లు కూడా పూర్తి కాలేదు.' అని వివరణ ఇచ్చారు.

నా కామెంట్స్‌లో ఏదైనా భాగం తప్పుగా అర్థం చేసుకోబడినా లేదా బాధ కలిగించేలా ఉన్నా.. హృదయపూర్వకంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు  విజయ్ దేవరకొండ చెప్పారు. శాంతి, అభివృద్ధి, యూనిటీ మాట్లాడటమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు.

విజయ్ ఏమన్నారంటే?

రెట్రో ఈవెంట్‌లో పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు. 'పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదు. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం మీద ఎటాక్ చేస్తారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే! 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పని లేకుండా కొట్లాడుతున్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి' అని అన్నారు. దీనిపై తెలంగాణ ట్రైబల్ అసోసియేషన్స్ అధ్యక్షుడు, న్యాయవాది కిషన్ రాజ్ చౌహాన్, ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.