''ట్రైలర్ కి ఈ రచ్చ ఏందిరా నాయనా! ఏందిరా ఈ మెంటల్ మాస్'' అంటూ తన ముందు ఉన్న అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. ఆయన కథానాయకుడిగా 'లైగర్' సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఈ రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగింది. హాల్ అంతా అభిమానుల ఈలలు, చప్పట్లు, కేకలతో దద్దరిల్లింది. వాళ్ళకు కిక్ ఇచ్చే రేంజ్ లో విజయ్ దేవరకొండ మాట్లాడారు. 


''నాకు ఈ రోజు ఏమీ అర్థం కావడం లేదు. మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది. రిలీజ్ అయిన సినిమా కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు. అయినా ట్రైలర్ కి ఈ రచ్చ ఏందిరా నాయన'' అంటూ విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేశారు. 


తనకు డ్యాన్స్ అంటే నాకు చిరాకు అని విజయ్ దేవరకొండ చెప్పారు. అయినా సరే 'లైగర్'లో పాటలకు అంత డ్యాన్స్ చేశానంటే మా వాళ్ళు (అభిమానులు) గర్వంగా ఫీల్ కావాలని, ఎంజాయ్ చేయాలని ఆయన అన్నారు. ఆగస్టు 25న 'లైగర్' విడుదలయ్యే ప్రతి థియేటర్ నిండిపోవాలని, ఆ రోజు ఇండియా షేక్ అయితదని విజయ్ దేవరకొండ ధీమా వ్యక్తం చేశారు.


తాను 'లైగర్' గురించి మాట్లాడనని, ఇండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ విజయ్ దేవరకొండ అని పూరి జగన్నాథ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కరణ్ జోహార్, అనిల్ తడానీ, హీరోయిన్ అనన్యా పాండే, ప్రొడ్యూసర్ ఛార్మి కౌర్ తదితరులు పాల్గొన్నారు. 


Also Read : అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది



విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.


Also Read : 'పరంపర 2' రివ్యూ: ఫస్ట్ సీజన్ కంటే లెంగ్త్ తక్కువ - జగపతి బాబు, నవీన్ చంద్ర, శరత్ కుమార్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?