Sithara Entertainments Upcoming Films: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) - సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓవైపు పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు మీడియం రేంజ్ చిత్రాలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు రూపొందిస్తూ మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు. 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే సినిమాలను మాత్రేమే నిర్మిస్తూ.. దాని అనుబంధ సంస్థ 'సితార ఎంటర్టైన్మెంట్స్' పేరు మీద ఇతర చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తూ ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. అలానే ఈ మధ్య కాలంలో 'ఫార్చూన్ ఫోర్ సినిమాస్' బ్యానర్ ను ఏర్పాటు చేసి త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్యను కూడా తమ సినిమాలో నిర్మాణంలో భాగం చేస్తున్నారు. 


గతేడాది సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి 'సార్' 'మ్యాడ్' వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇటీవల 'భ్రమయుగం' లాంటి మలయాళ మూవీని తెలుగులోకి డబ్బింగ్ చేసి లాభాలు వెనకేసుకున్నారు. ఇప్పుడు లేటెస్టుగా 'టిల్లు స్క్వేర్' వంటి మరో భారీ విజయం వీరి ఖాతాలోకి వచ్చి చేరింది. 'డీజే టిల్లు' సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 96 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 100 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ జోష్ లో నిర్మాత నాగవంశీ మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా పది సినిమాలను రూపొందించడానికి రెడీ అయ్యారు. 


సితార బ్యానర్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మే17వ తేదీన విడుదల కానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న NBK 109 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది దసరా సీజన్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీ కలయికలో 'లక్కీ భాస్కర్' అనే సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకే సాయి దుర్గ తేజ్, డైరెక్టర్ సంపత్ నంది కాంబోలో 'గంజా శంకర్' అనే చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 


Also Read: ఎట్టకేలకు కొరటాల శివ సినిమాకి విముక్తి - 'కృష్ణమ్మ' రిలీజ్ డేట్ ఫిక్స్!


రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 వంటి పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. దీని కంటే ముందు గౌతమ్ డైరెక్షన్ లో నూతన నటీనటులతో 'మ్యాజిక్' అనే మూవీ రూపొందుతోంది. అలానే 'మ్యాడ్' కు సీక్వెల్ గా 'మ్యాడ్ మ్యాక్స్' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. 'టిల్లు స్క్వేర్' హిట్టవడంతో ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'టిల్లు క్యూబ్' సినిమా చెయ్యాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చారు. లేటెస్టుగా మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ఓ సినిమా చేస్తున్నారు. నిన్న అశోక్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. 


ఇక మాస్ మహారాజా రవితేజ - జాతిరత్నాలు అనుదీప్ కేవీ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ సెట్ చేశారు. ఇందులో రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా చేయడానికి సంకల్పించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో 'అల వైకుంఠపురంలో' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కలయికలో రానున్న చిత్రమిది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కానీ, ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది క్లారిటీ రావడం లేదు. ఇలా వేటికవే ప్రత్యేకమైన వివిధ ప్రాజెక్ట్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ చేతిలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది.


Also Read: 'పిజ్జా 4'లో హీరోయిన్ గా తెలుగు ‘బిగ్ బాస్’ బ్యూటీ!