Tiger Shroff: బాలీవుడ్‌లో కేవలం యాక్షన్ సినిమాలకు మాత్రమే పరిమితమయిన హీరోలు కొందరు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు టైగర్ ష్రాఫ్. 2014లో ‘హీరోపంటీ’ అనే సినిమాతో హీరోగా హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు టైగర్. అప్పటినుండి ఇప్పటివరకు ఏ మాత్రం రూటు తప్పకుండా యాక్షన్ సినిమాలనే చేసుకుంటూ వెళ్తున్నాడు. తను నటించిన సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. అందులో తన యాక్షన్‌కు మాత్రం మంచి మార్కులే పడతాయి. ప్రస్తుతం ‘బడే మియా చోటే మియా’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయిన టైగర్.. తెలుగులో తను కలిసి నటించాలనుకుంటున్న హీరోల గురించి బయటపెట్టాడు.


ఆ ట్యాగ్ సంతోషాన్నిచ్చింది..


అక్షయ్ కుమార్‌తో కలిసి టైగర్ ష్రాఫ్ చేసిన మల్టీ స్టారర్ చిత్రమే ‘బడే మియా చోటే మియా’. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన ప్రతీ అప్డేట్.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్‌ను ప్రారంభించాడు టైగర్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ హీరో.. తనకు వచ్చిన యాక్షన్ హీరో అనే ట్యాగ్‌పై స్పందించాడు. ‘‘సినీ పరిశ్రమలో ఎంతో టాలెంట్, తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని పోటీ ఉంటుంది. అలాంటి వాటి మధ్యలో నాకు యాక్షన్ హీరో అని ప్రేక్షకుల తరపున ఒక గుర్తింపు దక్కింది’’ అంటూ యాక్షన్ హీరో ట్యాగ్‌ గురించి సంతోషం వ్యక్తం చేశాడు టైగర్ ష్రాఫ్. దాంతో పాటు తన కోరిక గురించి కూడా చెప్పుకొచ్చాడు.


అదే నా కోరిక..


‘‘యాక్షన్ హీరో ట్యాగ్ అనేది గౌరవంగా భావిస్తాను. నేను దాని గురించే ఎప్పుడూ కలలు కనేవాడిని. చిన్నప్పటి నుండి నాకు నచ్చిన హీరోలను ఇమిటేట్ చేస్తూ ఉండేవాడిని. నా కలలు నిజమవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది’’ అని బయటపెట్టాడు టైగర్. ఇక అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన అనుభవాన్ని కూడా పంచుకున్నాడు. ‘‘అది ఒక అద్భుతమైన ప్రయాణం. షూటింగ్‌లో నా సమయం చాలా బాగా గడిచింది. అది కూడా అక్షయ్ సార్ వల్లే. తనకు చాలా అద్భుతమైన కో స్టార్. నాకు అన్నయ్య లాంటివాడు’’ అని తెలిపాడు. అదే సమయంలో తనకు సౌత్‌లో నటించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టాడు టైగర్ ష్రాఫ్. ‘‘నేను అల్లు అర్జున్, ఎన్‌టీఆర్‌లకు పెద్ద ఫ్యాన్. వెండితెరపై వారితో ఏదో ఒకరోజు తలపడాలని అనుకుంటున్నాను’’ అని రివీల్ చేశాడు.


అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్..


ప్రస్తుతం టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ హీరోలుగా నటించిన ‘బడే మియా చోటే మియా’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. తన అప్‌కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు టైగర్. ‘‘ప్రస్తుతం బాగీ 4, రాంబో, సింగం ఎగైన్ చిత్రాల్లో నటిస్తున్నాను. సినిమాల్లో యాక్షన్ చేయాలంటే చాలా కష్టపడాలి. దర్శకుడు చెప్పింది చేసేస్తాను అంతే.’’ అని తెలిపాడు. టైగర్ ష్రాఫ్ చివరిగా ‘గణపత్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. అందుకే ప్రస్తుతం టైగర్ ఆశలన్నీ ‘బడే మియా చోటే మియాన్’పైనే ఉన్నాయి. ఈ సినిమాను అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేశారు.


Also Read: తన మూవీలో నన్ను కాదని, ఆ హీరోకి ఛాన్స్ ఇచ్చింది - మాజీ భార్యపై అమీర్‌ఖాన్ కామెంట్స్