Aamir Khan about Laapataa Ladies: ఏబీపీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌’లో ఎందరో బాలీవుడ్ నటీనటులు పాల్గొన్నారు. అందులో వారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చారు. ఇక అమీర్ ఖాన్ కూడా ఈ సమ్మిట్‌లో తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. అమీర్ ఖాన్, కిరణ్ రావు కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. కానీ విడాకుల తర్వాత కూడా వీరు.. ప్రొఫెషనల్‌గా ఏ విభేదాలు లేకుండా కలిసి పనిచేస్తున్నారు. కిరణ్ రావు దర్శకత్వంలో ‘లాపతా లేడీస్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు అమీర్. ఈ సినిమా థియేటర్లలో విడుదలయిన తర్వాత దీనికి సంబంధించిన తన ఆడిషన్ వీడియోను విడుదల చేస్తానని తెలిపారు.


ఇది చిన్న సినిమా..


ముందుగా ‘లాపతా లేడీస్’లో ఒక పాత్ర చేయాలని తనకు కోరిక కలిగిందని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ పాత్రను రవి కిషన్ చేస్తున్నాడని అన్నారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్ అయిన అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ద్వారా తానే స్వయంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నప్పుడు రవి కిషన్ చేసిన పాత్రలో తానే నటించాలని అనుకొని స్క్రీన్ టెస్ట్ కూడా చేశారట అమీర్. ఈ స్క్రీన్ టెస్ట్‌లో తన పర్ఫార్మెన్స్ కిరణ్ రావుకు కూడా నచ్చిందట. కానీ అమీర్‌కు ఉన్న స్టార్ స్టేటస్ వల్ల పాత్రలోని గొప్పదనాన్ని ఎవరూ గుర్తించరేమో అని భావించి వెనక్కి తప్పుకున్నారట. ఆ పాత్రను చేస్తానని తాను కిరణ్ రావుతో చెప్పినప్పుడు ‘‘నువ్వు పెద్ద స్టార్‌వి. నా చిన్న సినిమాను బ్యాలెన్స్ కోల్పోయేలా చేస్తావు’’ అని తను ముక్కుసూటిగా చెప్పి రిజెక్ట్ చేసిందని అమీర్ బయటపెట్టారు.


అమీర్ ఖాన్ ఆఫర్..


‘లాపతా లేడీస్’లో నటించడం కోసం తనను తాను పూర్తిగా మార్చుకుంటానని కూడా ఆఫర్ ఇచ్చారట అమీర్ ఖాన్. ‘‘ప్రేక్షకులు నిన్ను గుర్తుపట్టకపోతే ఏం లాభం. మనం టికెట్స్ అమ్మాలి కదా’’ అని కిరణ్ రావు చెప్పిందట. అంతే కాకుండా ఈ సినిమాలో రవి కిషన్ నటనను కిరణ్ రావు ప్రశంసించారు. ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవి కిషన్ కనిపించనున్నాడని, తనకంటే బాగా ఈ పాత్రను ఎవరూ చేయలేరు అన్నటుగా చేశాడని చెప్పింది. ఇక సినిమా విడుదలయిన తర్వాత ‘లాపతా లేడీస్’లో రవి కిషన్ చేసిన పాత్ర కోసం తను ఇచ్చిన ఆడిషన్ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తానని, ఆ వీడియో చూసి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఆడియన్సే చెప్పాలని అమీర్ అన్నారు.


ముగ్గురు కొత్త నటీనటులు..


కిరణ్ రావు దర్శకత్వం వహిస్తున్న ‘లాపతా లేడీస్’ చిత్రం ద్వారా ఎందరో కొత్తవారు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఈ సినిమా ద్వారా స్పర్శ్, నితాన్షి, ప్రతిభ అనే ముగ్గురు నటీనటులు డెబ్యూకు సిద్ధమయ్యారు. ‘‘ఇది వారి మొదటి సినిమానే అయినా వారిలో చాలా ఆత్మ విశ్వాసం ఉంది. నేర్చుకోవాలి అనే తపన ఉంది. ఇన్నాళ్లు వారికి ఎలాంటి అనుభవం లేకపోయినా ఇప్పుడు అన్నీ తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు’’ అని కిరణ్ రావు ప్రశంసించింది. అమీర్ ఖాన్ కూడా ఈ ముగ్గురిపై ప్రశంసలు కురిపించారు. ఇద్దరు పెళ్లికూతుళ్లు ఒక ట్రెయిన్‌లో తప్పిపోయి వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు. అక్కడ వారికి ఎదురైన సమస్యలపై ‘లాపతా లేడీస్’ చిత్రం సాగుతుందని తెలుస్తోంది.



Also Read: ఇది మంచిది కాదు మానుకో, ఎక్స్ ట్రాలు చేసిన మీమ‌ర్‌కు సందీప్ కిషన్ స్ట్రాంగ్ వార్నింగ్