Thotapalli Madhu About Vani Viswanath: టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తోటపల్లి మధు.. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూ.. టాలీవుడ్‌లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినీ పరిశ్రమలోని సీనియర్లు అందరి గురించి మర్యాద లేకుండా మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఈ ఇంటర్వ్యూలో తనకు ఉన్న లవ్ ఎఫైర్స్ గురించి కూడా బయటపెట్టారు. తన పర్సనల్ విషయాల గురించి, కెరీర్ మొదట్లో తను పడిన కష్టాల గురించి కూడా చెప్పుకొచ్చారు తోటపల్లి మధు. ఒక సీనియర్ నటి పేరును ప్రస్తావిస్తూ మధు చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.


పెళ్లి జరగలేదు..


‘ఘరానా మొగుడు’ ఫేమ్ వాణి విశ్వనాథ్‌తో తనకు ప్రేమాయణం నడిచిందని షాకింగ్ విషయాలు బయటపెట్టారు తోటపల్లి మధు. ‘‘భలే దంపతులు.. సినిమా సమయంలో నేను, వాణి విశ్వనాథ్ పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. పెళ్లి చేసేసుకోవాలని కేరళలోని గురువాయుర్‌కు కూడా వెళ్లాం. ఆరోజు సూర్య గ్రహణం అని గుడి తెరవలేదు. అందుకే వెనక్కి వచ్చేశాం, చేసుకోలేదు. అప్పటికే సంవత్సరం పాటు కలిసి తిరిగాం. మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ ఈ సినిమాలో పనిచేసే ఆడవారి దగ్గర సమస్య ఏంటంటే వారిని తృప్తిపరిచేలాగా డబ్బులు సంపాదించాలి, మాటలు చెప్పాలి. అలా రెండు, మూడు సార్లు జరిగింది. పెళ్లి వరకు వెళ్లి.. అయిపోయింది అనుకున్నా కూడా అవ్వలేదు’’ అని చెప్పుకొచ్చారు తోటపల్లి మధు.


ఇండస్ట్రీతో సంబంధం లేదు..


తోటపల్లి మధుకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్నా కూడా తన పిల్లలను కూడా వీటన్నింటికి దూరంగా పెంచానని, అబ్బాయిని అమెరికాలో చదివించానని తెలిపారు. తన కొడుకును సినీ పరిశ్రమకు దూరంగా పెంచినందుకు తనను చాలామంది మెచ్చుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ కూడా తన ఇంట్లో ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్క షీల్డ్ కూడా ఉండదని బయటపెట్టారు. ఇక కాలేజీ రోజుల నుండే నాటకాలపై ఆసక్తితో ఉండేదని, ప్రిన్సిపల్‌తో సహా ప్రతీ ఒక్కరు తాను సినిమాల్లోకి వెళ్తానని ఫిక్స్ అయ్యి ఉండేవారని అన్నారు. సినిమాలపై ఇష్టంతో చెన్నైకు వచ్చిన మధుకు మొదట్లో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయో గుర్తుచేసుకున్నారు.


అరటి తొక్కలు తిన్నాను..


‘‘మద్రాస్‌కు వెళ్లి బాలచందర్‌ను కలిశాను. అలా ఆఫీసులకు వెళ్లడం, రావడం జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు అక్కడ భోజనం పెట్టేవాళ్లు. అప్పట్లో పాండీ బజార్‌లోనే నా రూమ్. రెండు రోజులకు ఒకసారి లేదా రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసేవాడిని. దాదాపు రెండేళ్లు అలా గడిపాను. ఒక్కొక్కసారి అసలు తినడానికి ఏం లేకపోతే కిరాణా కొట్టు దగ్గర పడేసిన అరటి తొక్కలను ఎవరూ చూడకుండా తీసుకొని, వాటిని కడుక్కొని తినేవాడిని’’ అంటూ అప్పటి కష్టాలను గుర్తుచేసుకున్నారు తోటపల్లి మధు. మొత్తానికి ఒక ఇంటర్వ్యూతో సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈ సీనియర్ నటుడు.



Also Read: కింగ్ చుట్టూ ఏపీ రాజకీయాలు - నాగార్జున మద్దతు ఆ పార్టీకేనా? ఆ వార్తల్లో నిజమెంతా?