'Tholi Samaram' Song From Yatra 2 : 2019లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. మహి వి రాఘవ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైయస్సార్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి అద్భుతంగా నటించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా 'యాత్ర2' రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం, ఏపీ రాజకీయాల్లో వైయస్ జగన్ ఎదిగిన విధానాన్ని హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.


అలాగే అప్పట్లో జగన్ చేసిన పాదయాత్రను కూడా ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్ గా చూపించబోతున్నారట. పాదయాత్రతో మొదలై, ముఖ్యమంత్రి అయ్యే వరకు 'యాత్ర2' కథ కొనసాగనుందట. అంతేకాదు, జగన్ పాలనలో ప్రజలు ఎలా ఉన్నారనే పాయింట్ ని కూడా ఇందులో టచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో వైయస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నాడు.  ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో ఉత్తరాది నటుడు, మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ పార్టీ కీలక నేత సోనియా గాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు. ఇక ఈ సీక్వెల్ని కూడా 2024 ఏపీ ఎలక్షన్స్ కి ముందు విడుదల చేయబోతున్నారు.


ఏపీ ఎలక్షన్స్ కి కొద్ది రోజుల టైం మాత్రమే ఉండడంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇప్పటికే సినిమా నుంచి పోస్టర్స్, టీజర్ తో పాటు ఇటీవల ఫస్ట్ సింగిల్ 'చూడు నాన్న' అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఫాదర్ సెంటిమెంట్ తో ఎంతో ఎమోషనల్ గా సాగింది. ఇక ఇప్పుడు సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. ఈ పాట సైతం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. వీడియో సాంగ్ విషయానికొస్తే.. 'తొలి సమరం' అంటూ సాగే వీడియో సాంగ్ లో వైఎస్ జగన్ (జీవా) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, పార్టీ తరపున ఎన్నికల శంఖారావం పూరించడం, ప్రచారంలో పార్టీ గుర్తు 'ఫ్యాన్' ని ప్రదర్శించడం వంటి దృశ్యాలు ఉన్నాయి.


ఇందులో  ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి గారి  పాత్ర‌లో జీవా చాలా అద్భుతంగా కనిపించారు. ఈ పాటలో ఆయన పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. విజువల్స్ కూడా అధ్బుతంగా ఉన్నాయి. సంతోష్ నారాయణన్ సంగీత సారధ్యంలో ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను గౌతమ్‌ భరధ్వాజ్‌ ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని 2024 ఫిబ్రవరి 8న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో 'యాత్ర' విడుదలైంది. ఇప్పుడు సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత అదే నెలలో, ఎన్నికల ముందు 'యాత్ర 2'ని రిలీజ్ చేస్తుండటం గమనార్హం. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్ బ్యానర్లపై శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : ‘దేవర’ స్థానంలోకి ‘ఫ్యామిలీ స్టార్’? క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు