సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’. ఆప్తమిత్ర అనే కన్నడ చిత్రానికి రీమేక్ గా, 2005 లో వచ్చిన ఈ సినిమా తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. హారర్ కామెడీ చిత్రాలకు శ్రీకారం చుట్టింది. అయితే దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి భయపెడుతూ నవ్వించడానికి సీక్వెల్ మూవీ ''చంద్రముఖి 2'' రెడీ అవుతోంది. కాకపొతే ఈసారి కొత్త క్యాస్టింగ్ తో వస్తున్నారు.


‘చంద్రముఖి 2’ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, దర్శక నటుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. 
గత కొన్ని రోజులుగా 'చంద్రముఖి 2' సినిమా షూటింగు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్స్ లో లారెన్స్ , కంగనా రనౌత్ లతో పాటుగా ఇతర ప్రధాన తారాగణం పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. గురువారంతో మూడో షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలిపారు. 


ఈ సందర్భంగా 'చంద్రముఖి 2' సెట్స్ లో నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు. ఇందులో లారెన్స్ మరియు డైరక్టర్ పి. వాసులతో పాటుగా సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, పాపులర్ కమెడియన్ వడివేలు, హీరోయిన్ లక్ష్మీ మీనన్ కనిపిస్తున్నారు. అలానే రావు రమేష్, కార్తీక్ శ్రీనివాసన్, రవి మారియా, మహిమా నంబియార్, శృతి డాంగే, సురేష్ చంద్ర మీనన్ తదితరులు భాగమయ్యాయి.


కాగా, తలైవా నటించిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్ కావడంతో 'చంద్రముఖి 2' పై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాకపొతే అధ్బుతమైన నటన కనబరిచిన రజినీ కాంత్ - జ్యోతిక స్థానాల్లో రాఘవ లారెన్స్ , కంగనా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. 


ఇందులో కంగనా రనౌత్ ఒక రాజ నర్తకిగా కనిపించనుంది. దీని కోసం ఆమె క్లాసికల్ డ్యాన్స్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుందని తెలుస్తోంది. ఈ సినిమా మొదటి భాగాన్ని మించి అలరిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నిజానికి 'చంద్రముఖి' సీక్వెల్ గా తెలుగులో 'నాగవల్లి' అనే సినిమా వచ్చింది. విక్టరీ వెంకటేష్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరి ఇప్పుడు చేస్తున్న 'చంద్రముఖి' సీక్వెల్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.




''చంద్రముఖి 2'' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్.డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కక్రేజీ ప్రాజెక్ట్ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వెలువడనున్నాయి.


Read Alos: హాలీవుడ్ టాప్ హీరోలకే చెమటలు పట్టిస్తున్న చెర్రీ, తారక్ - ఆ అవార్డుల్లో 2 కేటగిరీల్లో నామినేషన్స్