'పెళ్లిచూపులు' సినిమాతో తెలుగు వెండితెరకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీని తరుణ్ భాస్కర్ తన రైటింగ్, స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ డైరెక్టర్ తీసిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. యూత్ ని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది  రీసెంట్ గా రీరిలీజ్ అయి భారీ వసూళ్లను రాబట్టింది. ఈ రెండు సినిమాలు కూడా అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చినవే. ఇప్పుడు మళ్లీ అదే ప్రొడక్షన్ సంస్థ నుండి తరుణ్ భాస్కర్ కి నిర్మాత సురేష్ బాబు మరో అవకాశం ఇచ్చేందుకు రెడీ అయ్యారు.


ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ తో ఆ మధ్య ఓ సినిమా చేయాలని తరుణ్ భాస్కర్ అనుకున్నారు. కథ కూడా ఓకే అయింది. చర్చల్లో ఉందని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారని వార్తలు వచ్చిన కొంతకాలానికి ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అందరూ దాన్ని మర్చిపోయారు. తరుణ్ భాస్కర్ కూడా డైరెక్టర్ గా కాకుండా నటుడిగా బిజీ కావడం, మరోవైపు వెంకటేష్ ఇతర ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రాజెక్టుపై ఎవరు స్పందించింది లేదు. ఇదిలా ఉంటే దగ్గుపాటి హీరో రానా సపోర్ట్ తో మళ్ళీ తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'(Keeda Kola) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.


ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకుడు తరుణ్ భాస్కర్ కి వెంకటేష్ ప్రాజెక్ట్ కు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి తరుణ్ భాస్కర్ బదిలిస్తూ.." నిజానికి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కథ సెట్ అయినప్పటికీ చివర్లో క్లైమాక్స్ మాత్రం అనుకున్నట్లు పేపర్ పైకి రాలేదు. నేను ఎప్పుడూ కూడా అక్కడే తడబడుతూ ఉంటాను. పర్ఫెక్ట్ క్లైమాక్స్, పర్ఫెక్ట్ సబ్జెక్టుతోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. ఏదో ఒకటి కానిచ్చేద్దాం అనుకుంటే మళ్లీ నన్నే తిడతారు. ఇతనికి పెద్ద హీరోల సినిమాలు హ్యాండిల్ చేయడం సరిగ్గా రాదు అనే రిమార్కులు నాకొద్దు. అందుకే టైం తీసుకున్నా కూడా మంచి సబ్జెక్టు ఇవ్వాలని అనుకుంటున్నాను" అని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.


ఈ డైరెక్టర్ చెప్పినదాన్ని బట్టి చూస్తే వెంకటేష్ తో ప్రాజెక్ట్ క్యాన్సల్ కాలేదని స్పష్టం అవుతుంది. కాకపోతే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వచ్చేందుకు టైం పట్టే అవకాశం ఉంది. ఇక 'కీడా కోలా' సినిమా విషయానికొస్తే.. దాదాపు 8 ప్రధాన పాత్రల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ పాత్రలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కూడా ఉండడం విశేషం. ఈ మూవీలో తరుణ్ భాస్కర్ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషించారు. వివేక్ సుధాన్ష్, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, నండూరి శ్రీపాద నందిరాజ్, ఉపేంద్ర వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. నవంబర్ 3 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం - అనారోగ్యంతో సోదరి మృతి!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial