Swapna Dutt Statement About Kalki 2898 AD Collectios: ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా 'క‌ల్కీ 2898 ఏడీ'. జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌కు ముందుకు వ‌చ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుంది. క‌లెక్ష‌న్స్ లో దూసుకుపోతోంది. దీంతో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది, ఆ సినిమాని దాటేసింది ఈ సినిమాని దాటేసింది అంటూ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇక ప్ర‌భాస్ ఫ్యాన్స్ అయితే.. రికార్డుల మోత అంటూ తెగ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే, ఈ సినిమా నిర్మాతల్లో ఒక‌రైన స్వ‌ప్న ద‌త్ మాత్రం ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. రికార్డులు కోసం సినిమాలు తీయ‌లేదంటూ పోస్ట్ పెట్టారు. 


న‌వ్వొస్తుంది... 


'కల్కీ' పాన్ ఇండియా సినిమాని వైజ‌యంతి మూవీస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాత అశ్వినీ ద‌త్ కూతుర్లు ప్రియాంక ద‌త్, స్వ‌ప్న ద‌త్ నిర్మించారు. ఈసినిమా ప్రీరిలీజ్ బిజినెస్ లోనే రికార్డులు క్రియేట్ చేసింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా దూసుకుపోయింది. దీంతో ఇప్పుడు ఒక్క‌రోజు క‌లెక్ష‌న్లే దాదాపు రూ.191.5 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది 'క‌ల్కీ 2898' సినిమా. అయితే, ఈ క‌లెక్ష‌న్ల‌పై స్వ‌ప్న ద‌త్ ఒక పోస్ట్ పెట్టారు. "అంద‌రూ ఫోన్లు చేసి క‌లెక్ష‌న్లు ఎంత‌?  రికార్డులు బ్రేక్ చేశామా? అని అడుగుతుంటే ఆశ్చ‌ర్యంగా ఉంది. అలా అడుగుతుంటే న‌వ్వొస్తుంది. ఎందుకంటే రికార్డులు క్రియేట్ చేసిన‌వాళ్లు, రికార్డులు కోసం ఎప్పుడూ సినిమా తీయ‌రు. మేం ఆడియెన్స్ కోసం సినిమా తీశాం. సినిమా మీద ప్రేమ‌తో సినిమా తీశాం. మేం చేసింది కూడా అదే" అంటూ పోస్ట్ చేశారు స్వ‌ప్న ద‌త్. 


'క‌ల్కీ' ప్ర‌భంజ‌నం.. 


ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల్కీ ప్ర‌భంజ‌నం సృష్టించింది. నిజానికి ఈ సినిమాకి పెద్ద‌గా ప్ర‌మోష‌న్స్ చేయ‌లేదు. కానీ, ట్రైల‌ర్, టీజ‌ర్ లాంటివి చూసిన ప్ర‌జ‌ల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. అంతేకాకుండా ప్ర‌భాస్, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ లాంటి పెద్ద పెద్ద న‌టులు ఉండ‌టం వ‌ల్ల కూడా ఈసినిమాకి బాగా ప‌బ్లిసిటీ ల‌భించింది. దీంతో పాటుగా నాగ్ అశ్విన్ పై కూడా ప్రేక్ష‌కుల్లో న‌మ్మ‌కం ఉండ‌టం సినిమాకి ప్ల‌స్ అయ్యింది. ఈ సినిమాలో పురాణాల‌కు సైన్స్ ఫిక్ష‌న్ జోడించి చూపించారు. కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించాడు. గ్రాఫిక్స్, విఎఫ్ ఎక్స్ కి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇక ఇందులో దర్శక ధీరుడు రాజమౌళి, ఆర్జీవి, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్, ఫ‌రీదా అబ్దుల్లా త‌దిత‌రులు అతిథి పాత్రలో కనిపించి ప్రేక్ష‌కుల‌ను స‌ర్ ప్రైజ్ చేశారు.  బ్ర‌హ్మానందం క్యారెక్ట‌ర్ కూడా అంద‌రినీ తెగ ఆక‌ట్టుకుంది. దాదాపు రూ.600 కోట్ల వ్య‌యంతో సినిమా నిర్మించ‌గా.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ లో సినిమా దూసుకుపోయింది. ఆర్ ఆర్ ఆర్ రికార్డుల‌ను బ్రేక్ చేసింది క‌ల్కీ.  



అద‌ర‌గొట్టిన అశ్వ‌థామ‌.. 


'కల్కీ'కి సెకెండ్ పార్ట్ కూడా ఉన్న‌ట్లు సినిమా చివ‌ర్లో తెలుస్తుంది. అయితే, ఈ ఫ‌స్ట్ పార్ట్ లో మాత్రం ముఖ్యంగా ప్ర‌భాస్, అమితాబ్ బ‌చ్చ‌న్ స‌న్లు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. అశ్వ‌థామ‌గ అమితాబ్ బ‌చ్చ‌న్ యాక్టింగ్, ఆయ‌న అపీయ‌రెన్స్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. ఈ ఏజ్ లో ఆయ‌న చేసిన ఫైట్స్ కి ఫిదా అయ్యారు చాలామంది. అదే విష‌యాన్ని చెప్తూ ఎంతోమంది కామెంట్లు, పోస్ట్ లు కూడా పెట్టారు. ఇక ఇంటర్వెల్, సెకెండ్ ఆఫ్, క్లైమాక్స్ అయితే అద్భుతం అని పోస్ట్ లు పెడుతున్నారు అంద‌రూ. సెకెండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. 


Also Read: పెళ్లైన వారం రోజుల్లోనే ప్రెగ్నెన్సీ.? సోనాక్షి హాస్పిటల్ వెళ్లింది అందుకేనా?