Kanguva Movie Sequel Confirmed: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య ఐదు డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా కంగ అనే ఓ పోరాట యోధుడిగా ఆకట్టుకోనున్నట్లు సమాచారం. అక్టోబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. మరోవైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.


రెండు భాగాలుగా విడుదలకాబోతున్న ‘కంగువ‘


ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఎవరూ టచ్ చేయని కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందుకోసం భారీ బడ్జెట్ ను వెచ్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘కంగువ’ సినిమాకు సంబంధించి నిర్మాత జ్ఞానవేల్ రాజా కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు తెలిపారు. “’కంగువ’ సినిమాకు సంబంధించి రెండు భాగాలుగా కథ రాసుకున్నాం. పార్ట్ 1, పార్ట్ 2గా తీసుకురావాలనుకుంటున్నాం. రెండో భాగాన్ని పూర్తి చేశాం. సీక్వెల్ నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉంది. ‘కంగువ 1’ చిత్రీకరణ పూర్తి చేయడానికి 185 రోజులు తీసుకున్నాము. రెండో భాగం 2025 చివరల్లో లేదంటే.. 2026 ప్రారంభంలో షూటింగ్ మొదలవుతుంది. ‘కంగువ 2’ని 2027 జనవరిలో లేదంటే.. సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నాం.     


సీక్వెల్ పై అంచనాలు పెంచనున్న ‘కంగువ‘ ఎండింగ్


‘కంగువ’ తొలి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు జ్ఞానవేల్ తెలిపారు. “‘కంగువ’ పార్ట్ 1ను అద్భుతంగా తీస్తే, పార్ట్ 2 మీద మరిన్ని అంచనాలు పెరుగుతాయి. ఈ సినిమా విషయంలోనూ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాం. మొదటి భాగాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నాం. ఈ మూవీ చివరలో ప్రేక్షకులను కట్టిపడేసే సీన్లు ఉంటాయి. ఈ సన్నివేశాలు సీక్వెల్ పై భారీగా అంచనాలు పెంచుతాయి. సెకెండ్ పార్ట్ ఆటోమేటిక్ గా మంచి సక్సెస్ అందుకుంటుంది” అని నిర్మాత జ్ఞానవేల్ రాజా తెలిపారు. మొత్తంగా ‘కంగువ’ సినిమా విషయంలో మేకర్స్ వేస్తున్న ప్లాన్ అదుర్స్ అనిపించేలా ఉంది. అయితే,తొలి భాగం విడుదలయ్యాకే రెండో భాగం ఎలా ఉంటుంది? అనేది ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.






ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో విడుదల


ఇక ‘కంగువ’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 38 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.



Read Also: బికినీ వేసుకుంటేనే అవకాశాలు వస్తాయన్నాడు - పాత రోజులను గుర్తు చేసుకున్న మనీషా కోయిరాలా