'కంగువ' చిత్రంతో నవంబర్ 14న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్న తమిళ హీరో సూర్య ఓ క్రేజీ సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇంట్రెస్టింగ్ మూవీ మరేమిటో కాదు 'గజిని'. తాజాగా 'కంగువ' మూవీ ప్రమోషన్లలో స్వయంగా సూర్య ఈ విషయాన్ని బయటపెట్టి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 


తెరపైకి 'గజిని 2'... సూర్య ఏం చెప్పారంటే?
మురుగదాస్ దర్శకత్వంలో సూర్య, అసిన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'గజిని'. 2005లో రిలీజ్ అయిన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదే సినిమాను 2008లో హిందీలో అమీర్ ఖాన్, అసిన్ జంటగా రీమేక్ చేశారు. ఇక ఈ మూవీ హిందీ వెర్షన్ కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో సూర్య నట విశ్వరూపం చూసిన ప్రేక్షకులు సీక్వెల్ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా 'గజిని' మూవీకి సీక్వెల్ రాబోతోంది అంటూ సూర్య చేసిన అనౌన్స్మెంట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది.


ప్రస్తుతం సూర్య 'కంగువ' అనే సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో చేసిన చిట్ చాట్ లో సూర్య 'గజిని 2' గురించి ప్రస్తావించారు. 'కంగువ' ప్రచారంలో మొదటి దశగా సూర్యతో కూడిన బృందం ముంబైలో ఒక ఈవెంట్‌ను నిర్వహించింది. ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. అందులో సూర్య మాట్లాడుతూ మురుగదాస్ 'గజిని 2' కోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని, ఈ భారీ ప్రాజెక్ట్‌లో అమీర్ ఖాన్ కూడా భాగం కావచ్చునని చెప్పుకొచ్చారు.



ఒకే స్క్రీన్ పై అమీర్, సూర్య 
అయితే మురగదాస్ ఈ ప్రాజెక్టును తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారని, ఈ సీక్వెల్ తమిళ్ లో సూర్య, హిందీ వెర్షన్ లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. లేదంటే ఇద్దరు హీరోలు కలిసి కన్పించే విధంగా తమిళ, హిందీ క్రాస్ ఓవర్ గా, ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు అవుతుందా? అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఏదేమైనా ఈ ప్రాజెక్టు గనుక పట్టాలెక్కితే ఇది కచ్చితంగా భారీ సీక్వెల్ అవుతుంది. అంతేకాకుండా హిందీ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, తమిళ నట సింహం ఒకే స్క్రీన్ పై కన్పించేలా మేకర్స్ చేస్తున్న ప్లాన్ వర్కౌట్ అయితే ఇక అభిమానులకు పూనకాలే. కాగా ప్రస్తుతం సూర్య 42వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న 'కంగువ' సినిమాతో బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటించగా, నవంబర్ 14న తెలుగు, తమిళంతో పాటు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ మూవీ భారీ ఓపెనింగ్ రాబడుతుందనే నమ్మకంతో ఉన్నారు 'కంగువ' టీం. దానికి తగ్గట్టే హైప్ కూడా బాగానే ఉంది. 


Read Also : SSMB29: వీఎఫ్ఎక్స్‌కు తోడుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... మహేష్ బాబు సినిమాతో వెండితెరపై మాయ చేయబోతున్న దర్శక ధీరుడు