SS Rajamouli - Mahesh Babu Movie: రాజమౌళి సినిమా అనగానే ప్రేక్షకులలో అంచనాలు హైలో ఉంటాయి. ఎవరూ ఊహించని కథలతో వెండితెరపై విజువల్ వండర్స్ చేయడంలో ఆయన తర్వాతే మరెవరైనా అని చెప్పుకొవచ్చు. టెక్నాలజీని అద్భుతంగా వినియోగించుకుంటూ కళాఖండాలను తెరకెక్కించడంలో జక్కన్న దిట్ట. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించబోతున్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ నిర్మించడంతో పాటు వర్క్ షాపులు జరుగుతున్నాయి.


AI టెక్నాలజీ క్లాసులు వింటున్న రాజమౌళి, మహేష్ బాబు


రాజమౌళి సినిమా అంటేనే వీఎఫ్ఎక్స్‌తో నిండిపోయి ఉంటుంది. మహేష్ బాబుతో చేయబోయే సినిమాలో వీఎఫ్ఎక్స్‌కు AI టెక్నాలజీ తోడు కాబోతోంది. ఈ సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను హై లెవెల్ లో ఉపయోగించాలని జక్కన్న భావిస్తున్నారట. టెక్నాలజీ సాయంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం AI టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఓ న్యూజిలాండ్ సంస్థతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. వరల్డ్ క్లాస్ విజువల్స్ కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారట. గత కొంతకాలంగా AI టెక్నాలజీ డిజిటల్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. సినిమా పరిశ్రమలోనూ విస్తృతంగా వినియోగిస్తున్నారు. రీసెంట్ గా AI సాయంతో ‘కంగువా’ సినిమాలో సూర్య పాత్రకు ఏకంగా 30కి పైగా భాషల్లో డబ్బింగ్ చెప్పించారు. ఇప్పుడు రాజమౌళి కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ తో మాయ చేసేందుకు రెడీ అవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ అవుట్ ఫుట్ పొందే అవకాశం ఉండటంతో ఆయన AI టెక్నాలజీ సాయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.



‘ఇండియానా జోన్స్’ తరహాలో SSMB29


రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందబోతోంది. ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. ఈ సినిమా కథ కోసం రెండు సంవత్సరాలుగా కష్టపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2025 జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. కెఎల్ నారాయణ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారు? ఇతర నటీనటులు ఎవరు? అనే విషయంపై చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.  


Read Also: మాకూ హార్ట్ ఉంది... రెస్పెక్ట్ ఇవ్వండి - ఫీమేల్ జర్నలిస్టుకు అనన్య నాగళ్ల ఇన్‌డైరెక్ట్‌ కౌంటర్?