Venky Atluri : ఇటీవలే తన ద్విభాషా చిత్రం 'వాతి'తో (తెలుగులో 'సార్') ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి.. తాజాగా తన తదుపరి చిత్రం మాలీవుడ్ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్‌తో ఉంటుందని ప్రకటించారు. ఇకపై ప్రేమకథలే తీయాలని అనుకుంటున్నట్లు వెంకీ అట్లూరి పేర్కొన్నాడు. తన నెక్స్ట్ సినిమా కథాంశం ఉత్తర భారతదేశంతో ముడిపడి ఉంటుందని ఆయన అన్నారు. వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.


వెంకీ అట్లూరి రూపొందిస్తోన్న ఈ పాన్-ఇండియన్ మూవీని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది. ఈ మూవీని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తుండగా.. 2024 వేసవిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ పేరు పెట్టని కొత్త ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో విడుదల కానుంది. మొదటి పాన్-ఇండియా చిత్రంతో వస్తోన్న డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. తాను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నందుకు చాలా సంతోషిస్తున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 


తమిళ స్టార్ హీరో ధ‌నుష్ హీరోగా నటించిన బై లింగ్వల్ మూవీ 'వాతి'.. తెలుగులో 'సార్' టైటిల్ తో రిలీజ్ అయ్యి, భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాకు సంబంధించి ముందుగా విడుదలైన ట్రైలర్‌, టీజర్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 17న థియేటర్లలో రిలీజై మంచి ఆదరణ పొందింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈచిత్రం.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ర్టీమింగ్ అవుతుండగా.. తెలుగు, తమిళం భాషలకు చెందిన ఓటీటీ రైట్స్‌ను దాదాపుగా రూ.20 కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా ఈ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ మాస్టారు.. మాస్టారు వీడియో సాంగ్‌ను యూట్యూబ్’లో ఇప్పటికీ భారీ రెస్పాన్స్ వస్తోంది. అటు తమిళ్‌తో పాటు తెలుగులోనూ లక్షల్లో వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ పాటను శ్వేతా మోహన్ అద్భుతంగా పాడారు. ఇక ఇప్పటికే థియేటర్స్’తో పాటు ఓటీటీలోనూ అదరగొట్టిన ఈ సినిమా ఇటీవలే టీవీలో ప్రసారానికి రెడీ అయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను కూడా జెమినీ టీవీ ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఎప్పుడు ప్రసారం ఉంటుందో మాత్రం తెలియాల్సి ఉంది.  


'సార్' సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ విజయం సాధించి ధనుష్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. సార్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అదే డైరెక్టర్ – ప్రొడ్యూసర్స్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. దీంతో ఈ సినిమా కూడా సార్ స్థాయిలో భారీ విజయం సాధిస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
Also Read గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ కథతో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'?