Singer Kalpana Released Video And Gives Clarity About Rumours: తన భర్తపై, కుటుంబంపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. దాన్ని వెంటనే ఆపేయాలని ప్రముఖ గాయని కల్పన (Singer Kalpana) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని అందుకే టాబ్లెట్స్ వేసుకున్నట్లు వీడియోలో చెప్పారు. 'మీడియాలో నా గురించి, నా భర్త గురించి, మా కుటుంబంపై ఓ తప్పుడు ప్రచారం నడుస్తోంది. దీనిపై అందరికీ వివరణ ఇవ్వాలనుకుంటున్నా. నేను, నా భర్త, కుమార్తె సంతోషంగా జీవిస్తున్నాం. నేను 45 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ, ఎల్ఎల్‌బీ చేస్తున్నాను. నా భర్త సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు.

మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. దీని కోసం చికిత్స తీసుకుంటున్నాను. డాక్టర్స్ సూచించిన ప్రిస్క్రిప్షన్‌లో టాబ్లెట్ ఓవర్ డోస్ వేసుకున్నాను. అందువల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లాను. నా భర్త సరైన సమయంలో స్పందించడం, కాలనీవాసులు, పోలీసుల సహాయం వల్ల ఈ రోజు నేను మీ ముందు ఉన్నాను. త్వరలోనే నా పాటలతో మళ్లీ మిమ్మల్ని అలరిస్తాను. నా భర్త సహకారం వల్లే నచ్చిన రంగాల్లో నేను రాణిస్తున్నాను. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త. నా హెల్త్ గురించి ఎంక్వైరీ చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.' అంటూ కల్పన వీడియో రిలీజ్ చేశారు.

Also Read: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన విశ్వక్ సేన్ 'లైలా' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

కల్పన ఆత్మహత్యాయత్నం అంటూ ప్రచారం..

హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని విల్లాలో నివాసం ఉంటున్న కల్పన మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు చెప్పారు. వెంటనే ఆయన కాలనీ సంఘం ప్రతినిధులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించగా కోలుకుంటున్నారు. అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే కల్పన ఆత్మహత్యకు యత్నించారంటూ అటు సోషల్ మీడియా ఇటు న్యూస్ ఛానెళ్లలో పెద్దఎత్తున ప్రచారం సాగింది. ఈ క్రమంలో దీనిపై కల్పన కుమార్తె దయ మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తన తల్లిది ఆత్మహత్య కాదని.. టాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చెయ్యొద్దని.. తమ కుటుంబమంతా సంతోషంగా ఉందని స్పష్టం చేశారు.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'రేఖాచిత్రం' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా..?, మర్డర్ మిస్టరీ తెలుగులోనూ చూసేయండి!