Simhadri : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో 2003లో రిలీజైన 'సింహాద్రి' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇప్పుడు మరోసారి థియేటర్లలో కనువిందు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ కానుండగా ఆయన ఫ్యాన్స్ ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీ ద్వారా వచ్చే కలెక్షన్ లన్నీ నిరుపేద ఫ్యాన్స్ కు అందజేయనున్నారని 'ఎన్టీఆర్ ఆల్ ఇండియా ఫ్యాన్స్' ఓ ప్రకటనలో తెలిపారు.


గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతూ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఖుషి', 'తమ్ముడు', 'జల్సా', ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన 'పోకిరి', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' రీరిలీజ్ అయ్యి మరోసారి మంచి పేరు తెచ్చుకున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 'దేశ ముదురు' కూడా మరోసారి థియేటర్లలో విడుదలవడంతో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. మరికొన్ని సినిమాలైతే.. వాటికొస్తున్న ఆదరణ, కలెక్షన్లను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ స్ర్కీనింగ్ కూడా వేస్తున్నారు. అలాంటి వాటిలో 'ఖుషి', 'ఆరెంజ్' సినిమాలు నిలిచాయి.


ఇక రీరిలీజ్ అయిన సినిమాలకు వచ్చిన కలెక్షన్లతో మరోసారి మేకర్స్ ఎంజాయ్ చేస్తుంటే.. కొన్ని సినిమాలను మళ్లీ విడుదల చేయడం ద్వారా వచ్చే అమౌంట్ ను పేదవారికి లేదా ఏదైనా పార్టీకి విరాళంగా ఇవ్వాలని మరికొందరు ప్లాన్ చేస్తున్నారు. అదే తరహాలో ఇంతకుముందు రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' సినిమాను రీరిలీజ్ చేయడం ద్వారా వచ్చిన కలెక్షన్లను పవన్ కళ్యాణ్ 'జనసేన పార్టీ'కి ఇవ్వాలని నిర్ణయించినట్టు మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. ఈ మూవీ రీరిలీజ్ అయ్యి రూ.3 కోట్లకి పైగా కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం. ఇలా రీరిలీజ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఏదో ఒక పనికి లేదా సంస్థకు డొనేట్ చేయడం ఈ రోజుల్లో ట్రెండింగ్ గా మారిపోయింది.


ఇప్పుడు అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్, భూమిక నటించిన 'సింహాద్రి' సినిమా తారక్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న రీరిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించి 4కె డిజిటల్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాని కొనుగోలు చేసి రీరిలీజ్ చేస్తుండడం చెప్పుకోదగిన విషయం. ఇదిలా ఉండగా ఈ సినిమా రీరిలీజ్ పై తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ ప్రెస్ రిలీజ్ చేశారు. ఈ మూవీ ద్వారా కలెక్షన్లను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎన్టీఆర్ అభిమానులకు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కి కూడా చెప్పామని, ఆయన కూడా తమకు మద్దతు తెలిపినట్టు ప్రకటనలో తెలియజేశారు. అంతే కాదు ఇంత మంచి పని చేస్తున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ తమని అభినందించారని వారు ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. 


'సింహాద్రి' రీరిలీజ్ కలెక్షన్లు ఏ ఒక్కరి స్వలాభం కోసం కాదని అఖిల భారత ఎన్టీఆర్ అభిమానులు ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా మరోసారి స్పష్టం చేశారు. సింహాద్రిలో భూమిక, అంకిత కథానాయికలుగా నటించారు. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. 


Read Also: ఓటీటీలో విడుదలకు ‘కబ్జా’ రెడీ- ఎప్పుడు, ఎక్కడో తెలుసా?