సంగీతానికి వయసుతో సంబంధం లేదు. శ్రోతల మనసు మీటే బాణీ, ఆ బాణీకి తగ్గ సాహిత్యం తోడైతే మళ్లీ మళ్లీ వినాలని అనిపించేలా పాట రెడీ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ వంటి డిజిటల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత యువతకు తమ ప్రతిభ నిరూపించుకోవడానికి చక్కటి వేదిక దొరికినట్టు అయ్యింది. ఇటీవల తెలుగులో ఇండిపెండెంట్ మ్యూజిక్ కల్చర్ పెరుగుతోంది. ఔత్సాహికులు చేసిన పాటలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు దక్కుతున్నాయి. టీనేజ్ కుర్రాడు శ్రీ యశస్వి చేసిన పాట శ్రీకాంత్ అడ్డాల వరకు చేరింది. సాంగ్ నచ్చి ఆయన చివర్లో స్వయంగా తన గళంలో చిన్న సందేశాన్ని వినిపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


ప్రేమ పడని ఓ గొప్ప మజిలీ...
మదిని నువ్వు గెలిచావు లే!
టీ సిరీస్... వరల్డ్స్ బిగ్గెస్ట్ పాపులర్ యూట్యూబ్ ఛానల్! బాలీవుడ్‌లో వన్నాఫ్ ది టాప్ ప్రొడక్షన్ హౌస్ కూడా! ఇప్పుడు తెలుగు హీరోలతోనూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది. మార్చి 16న టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్ (తెలుగు)లో 'ప్రేమే' అని ఓ పాట విడుదలైంది. సాంగ్ చివర్లో 'విజయం కోసం ప్రయత్నించే వాడికి ప్రేమ, అనుబంధాలు ఎప్పుడూ తోడుగా ఉంటాయి' అని ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వాయిస్ వినిపిస్తుంది. ఆ సందేశమే కాదు... అప్పటి వరకు వినిపించిన పాట, విజువల్స్ సైతం వీక్షకుల్ని ఆకట్టుకున్నాయి. 


''ప్రేమ పడని ఓ గొప్ప మజిలీ మదిని నువ్వు గెలిచావులే...
ప్రతి క్షణం నీ తోడు నిలిచే ప్రేమనై ఉంటానులే!
విన్నాలే నీ రాగాలే నేనే...
మౌనాలే దాటేసే ప్రేమే మనసే చెప్పేనులే' అంటూ సాగిన ఈ గీతాన్ని రాసినది శ్రీ యశస్వి. 


'ప్రేమే' గీతాన్ని యశస్వి రాయడంతో పాటు స్వయంగా ఆలపించారు. ఈ పాటలో నటించినది సైతం ఆ అబ్బాయే. అన్నట్టు... అతని వయసు 18 ఏళ్లు. చిన్న వయసులో అతని ప్రతిభ చూసి ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. టీ సిరీస్ సంస్థలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా శ్రీ యశస్వి నిలిచారు.


పాటలో శ్రీ యశస్వి చెప్పిన ప్రేమకథ శ్రోతలకు నచ్చింది. ప్రతిభతో విదేశాల్లో ఉద్యోగం సంపాదించి... అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్ పేజీకి ఎక్కిన హీరో, తన చిన్ననాటి స్నేహితురాలిని ఎలా కలిశాడు? అనేది పాట ఇతివృత్తం.


Also Read: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?



ఇంటర్మీడియట్ - ఇంజనీరింగ్ మధ్య కాలంలో శ్రీ యశస్వి ఈ పాట మీద వర్క్ చేశారు. ఆయన వివరాల్లోకి వెళితే... కావూరి హిల్స్, మాదాపూర్‌లో శ్రీ చైతన్య ఐఐటి అకాడమీలో ఇంటర్ చదువుతున్న సమయంలో ఆటవిడుపుగా పాడిన పాట ఇది. దానికి స్నేహితుల ప్రోత్సాహంతో పాటు తల్లిదండ్రులు అండ తోడు కావడంతో సాంగ్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. డాల్బీ డ్రమ్స్ రికార్డింగ్ స్టూడియో సారథి, సంగీత దర్శకుడు సాయి శ్రీకాంత్ పాటను స్వరపరచారు.


ఈ పాటకు అడపా వినీత్ దర్శకత్వం వహించగా... హరీష్ గౌడ్ రంగపగారి, లవ్ కుష్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. బివిఆర్ శివకుమార్, సురేష్ ఎడిటర్స్. పాటలో యశస్వితో పాటు కష్వి, మాస్టర్ శ్రీ చరణ్, బేబీ భాన్విక నటించారు. ఇక పాటను అడోరబుల్ అరోమా ప్రొడక్షన్స్ మీద శైలజా రాణి నిర్మించారు.


Also Readమహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి