Shraddha Das Sings a Song in Paarijatha Parvam: ఈరోజుల్లో నటీనటులు కేవలం యాక్టింగ్‌పై మాత్రమే కాకుండా ఇతర అంశాలపై కూడా ఫోకస్ పెడుతున్నారు. ఒకరు ఇష్టంగా నిర్మాణంలోకి అడుగుపెడుతుంటే.. మరొకరు తమ సినిమాకు తామే పాటలు పాడుకుంటున్నారు. ఇప్పటికే ఎందరో నటీనటులు తమ సినిమాలతో పాటు ఇతర నటీనటుల చిత్రాల్లో కూడా పాటలు పాడారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి శ్రద్ధా దాస్ కూడా చేరారు. తన అప్‌కమింగ్ మూవీ ‘పారిజాత పర్వం’లో పాట పాడి ప్రేక్షకులకు షాకిచ్చింది. అయితే పాటను మాత్రమే కాదు.. పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా చాలా క్రియేటివ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్.


స్వయంగా పాడింది..


కొన్నాళ్ల క్రితం వరకు సినిమాల్లో ఎక్కువగా ఛాన్సులు లేని శ్రద్ధా దాస్.. ఇప్పుడు కనీసం ఏడాదికి ఒక సినిమాతో అయినా ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సినిమాల్లో అవకాశాలు లేవని బుల్లితెరపై డ్యాన్స్ షోకు జడ్జిగా వెళ్లింది శ్రద్ధా. అప్పటినుండి తనకు సినిమా అవకాశాలు రావడం పెరిగింది. ప్రస్తుతం తను ‘పారిజాత పర్వం’ అనే క్రైమ్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి కాన్సెప్ట్ టీజర్ విడుదలయ్యింది. ఇక తాజాగా ‘పారిజాత పర్వం’ నుండి రంగ్ రంగ్ రంగీలా అనే పాట విడుదలయ్యింది. ఈ పాటను శ్రద్ధా దాస్ స్వయంగా పాడడం విశేషం. 



సంగీత దర్శకుడు వద్దన్నా..


సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తున్న ‘పారిజాత పర్వం’కు రీ సంగీతాన్ని అందించాడు. అయితే ముందుగా ‘రంగ్ రంగ్ రంగీలా’  సాంగ్ అనౌన్స్‌మెంట్‌ను చాలా డిఫరెంట్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో రీ.. తను కంపోజ్ చేసిన ట్యూన్‌ను సంతోష్‌కు వినిపించగానే అది తనకు చాలా బాగా నచ్చుతుంది. లిరిక్స్‌ను రామజోగయ్య శాస్త్రితో రాయిస్తే బాగుంటుంది అని కూడా మాట్లాడుకుంటారు. అప్పుడే శ్రద్దా దాస్ నుండి దర్శకుడికి ఫోన్ వస్తుంది. పాట ట్యూన్ రెడీ అయ్యింది అని చెప్పగానే తానే పాడతానని చెప్తేస్తుంది శ్రద్ధా. మ్యూజిక్ డైరెక్టర్‌కు శ్రద్ధాపై నమ్మకం లేకపోయినా.. దర్శకుడే బలవంతం చేసి మరీ పాడిస్తాడు. ఇక శ్రద్ధా వాయిస్‌లో ఈ ‘రంగ్ రంగ్ రంగీలా’ అనే పాట అదిరిపోయిందని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు.



ఇన్‌స్టాగ్రామ్‌లో పాటలు..


సినిమాలు ఉన్నా లేకపోయినా శ్రద్ధా దాస్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన ఫోటోషూట్స్‌ను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటుంది. అదే క్రమంలో మెల్లగా తను పాటలు కూడా పాడడం మొదలుపెట్టింది. తను పాడుతూ పోస్ట్ చేస్తున్న వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ లైకులు కూడా వచ్చేస్తున్నాయి. అదే నమ్మకంతో తను ‘రంగ్ రంగ్ రంగీలా’ పాట పాడతానని చెప్పగానే నో చెప్పలేకపోయాడు దర్శకుడు సంతోష్ కంభంపాటి. ఇక ‘పారిజాత పర్వం’ చిత్రంలో శ్రద్ధా దాస్‌తో పాటు మరో హీరోయిన్ మాళవికా సతీషన్ కూడా కనిపించనుంది. సునీల్, హర్ష చెముడు, శ్రీకాంత్ అయ్యర్.. ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 


Also Read: పవన్‌తో కలిసి ఎవరూ చేయలేరు, ఆయన రేంజ్ స్టార్ ఎవరూ లేరు - రాజమౌళితో సినిమాపై విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్