Shah Rukh Khan : భారతీయ సినిమాల్లోని అత్యుత్తమ నటుల్లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఒకరు. దాదాపు 3 దశాబ్దాల తన కెరీర్‌లోఎస్ఆర్కే విభిన్న క్యారెక్టర్స్ లో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు 2023 ఏడాది ఆయన కెరీర్ లోనే అద్భుతమైన ఇయర్ గా నిలవనుంది. ఎందుకంటే ఆయన రీసెంట్ గా నటించిన 'పఠాన్‌' రిలీజై, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. ఈ సినిమా అద్భుతమైన విజయం తర్వాత.. ఇప్పుడు మరో సారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ 'మ్యాగజైన్ రీడర్ పోల్‌'లో టాప్‌లో నిలిచి.. భారతీయ నటుడిగా షారుఖ్ సరికొత్త రికార్డు సృష్టించారు.


'2023TIME100' నిర్వహించిన పోల్ లో షారుఖ్ ఖాన్.. దిగ్గజ సెలబ్రిటీలను దాటుకుని టాప్‌లో నిలిచారు. దీంతో షారుఖ్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈ పోల్ లో మొత్తం 1.2 మిలియన్ల ఓట్లు పోలవగా.. అందులో ఎస్ఆర్కే 4 శాతం ఓట్లతో ఈ ఘనత దక్కించుకున్నారు. ఈ జాబితాలో కేవలం సినీ రంగానికి చెందిన వ్యక్తులు మాత్రమే కాకుండా అథ్లెట్ సెరెనా విలియమ్స్, నటుడు మిచెల్ యో, ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ, ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అయినా వారందర్నీ వెనక్కి నెట్టేసి షారుఖ్ రికార్డు సృష్టించారు. 


ఈ పోల్ లో దేశంలోని ఇస్లామిక్ పాలన నుంచి స్వేచ్ఛ కోసం నిరసన తెలిపిన ఇరాన్ మహిళలు 3 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇరాన్ మహిళలు TIME  2022 లో హీరోస్ ఆఫ్ ది ఇయర్‌లోనూ గుర్తింపు సాధించారు. అంతేకాదు గత సంవత్సరం పర్సన్ ఆఫ్ ది ఇయర్ రీడర్ పోల్‌లోనూ గెలుపొందారు. ఆ తర్వాత 1.9 శాతం ఓట్లతో బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్క్లే పోల్‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇక గతేడాది ఖతార్‌లో ఫ్రాన్స్‌తో జరిగిన ఎపిక్ ఫైనల్‌లో అర్జెంటీనాను ప్రపంచకప్ కీర్తికి చేర్చిన మెస్సీ 1.8 శాతం ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అతను తన రికార్డు -సమానమైన ఐదవ ప్రయత్నంలో ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో ఆస్కార్ విజేత మిచెల్ యోహ్ , మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ , మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, బ్రెజిలియన్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా వంటి ఇతర తారలు తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు.


షారుఖ్ ఖాన్ ఇటీవల నటించిన బ్లాక్‌బస్టర్ 'పఠాన్' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద లైఫ్‌టైమ్ కలెక్షన్‌లో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత సినిమా తీసిన షారుఖ్ కు ప్రేక్షకులుఈ సినిమాతో భారీ బూస్ట్ ఇచ్చారు. 'దిల్ వాలే దుల్హానియా లేజాయింగే', 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాలతో బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన షారుఖ్.. ఇప్పటివరకు 100కు పైగా చిత్రాల్లో నటించి, మెప్పించారు.  


ఇక షారుక్ ఖాన్ సినిమా విషయాలకొస్తే.. ‘పఠాన్’ సినిమా విజయం తర్వాత ఆయన నెక్ట్స్ అట్లీ దర్శకత్వంలో రానున్న జవాన్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమా జూన్ 2, 2023 న థియేటర్లలో విడుదల చేయనున్నామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత SRK, హీరోయిన్ తాప్సీ పన్నుతో రాజ్‌కుమార్ హిరానీ చిత్రం, ‘డుంకీ’లో నటించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానున్నట్టు సమాచారం. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న టైగర్ వర్సెస్ పఠాన్ కోసం సల్మాన్ ఖాన్‌తో కలిసి షారుఖ్ నటించనున్నారు. ఈ మూవీ జనవరి 2024లో సెట్స్ పైకి వెళ్లనుంది.


Also Read : మీటర్ రివ్యూ: కిరణ్ అబ్బవరం ఊర మాస్ ‘మీటర్’ ఎలా ఉంది? రీడింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?