Shah Rukh Khan About Massive Flops: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. 2023లో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లతో దుమ్మురేపారు. ‘పఠాన్‘, ‘జవాన్‘, ‘డుంకీ‘ సినిమాలతో ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించారు. తాజాగా దుబాయ్‌ లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో షారుఖ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 2018 తర్వాత సినిమాలకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో వివరించారు. 


సినిమాలు మానేసి పిజ్జాలు తయారు చేశా- షారుఖ్


2018లో వచ్చిన వరుస పరాజయాలతో 4 ఏండ్ల పాటు సినిమాలకు కొంతకాలం దూరం అయినట్లు షారుఖ్ వెల్లడించారు. “2018లో నాకు పెద్ద ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. ఘోర పరాజయాలు పొందాయి. ఆ సమయంలో సినిమాలకు కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకున్నాను. కథలు వినడం మానేశాను. ఒక చిన్న వంట గదిని ఏర్పాటు చేసుకున్నాను. పిజ్జాలు చేయడం నేర్చుకోవడం మొదలుపెట్టాను. పట్టుదలగా నేర్చుకున్నాను. చివరకు పర్ఫెక్ట్ రౌండ్ పిజ్జా చేయడం తయారు చేసుకున్నాను. మీ సినిమాల కంటే మీ పిజ్జాలు బాగున్నాయి. సినిమాలు తీయడం మానేయండని మా కుటుంబ సభ్యులు చెప్పేవారు. నేను తయారు చేసిన పిజ్జాలు బాగున్నాయని చెప్పడం నాకు చాలా సంతోషం కలిగించేది. వాళ్ల మాటలు నాకు మరింత ప్రోత్సాహం కలిగించేవి. అంతేకాదు, పిజ్జాలు తయారు చేయడంలో నాకు నా కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారు. వారి సహకారంతో సక్సెస్ అయ్యాను” అని షారుఖ్ వెల్లడించారు.  


కష్టపడి సక్సెస్ అందుకున్నా- షారుఖ్


“సినిమాల విషయంలో మళ్లీ జాగ్రత్త పడ్డాను. చక్కటి కథలను ఎంపిక చేసుకున్నాను. ఎలాగైనా పరాజయాల నుంచి సక్సెస్ అందుకోవాలని భావించాను. గతంతో పోల్చితే చాలా కష్టపడ్డాను. అనుకున్నట్టుగానే మంచి సక్సెస్ వచ్చింది. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాను. మళ్లీ హిట్ ట్రాక్ లో కొనసాగుతున్నాను. ప్రజలు నా నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అర్థం చేసుకున్నాను. వారికి తగినట్టుగా సినిమాలు చేస్తూ అభిమానాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాను. నా సినిమాలను ప్రేక్షకులు మునుపటి కంటే ఎక్కువ ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అని షారుఖ్ వివరించారు.


2018 తర్వాత ఇబ్బందుల్లో షారుఖ్


షారుఖ్ ‘ఫ్యాన్’, ‘జీరో’, ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ లాంటి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విఫలం అయ్యాయి. 2018 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. అదే సమయంలో తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో షారుఖ్ కుంగిపోయారు. 2023లో ‘పఠాన్’ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘జవాన్’ కూడా రూ. 1000 కోట్ల మార్కును దాటింది. ‘డంకీ’ మాత్రం సుమారు రూ. 500 కోట్లు వసూలు చేసింది.


Read Also: రూ. 170 కోట్లకు మించి ఇచ్చినా రాజీపడను, ‘శ్రీమంతుడు’ కేసుపై శరత్ చంద్ర హాట్ కామెంట్స్