సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మళ్ళీ పెళ్లి'. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై స్వయంగా నరేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ నెలకొంది. మే 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా విడుదలవుతోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు నరేష్, పవిత్ర. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ తమ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నరేష్, పవిత్ర ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో సోషల్ మీడియా ట్రోల్స్ గురించి టాపిక్ వచ్చింది. దాంతో ఒక అభిమాని ఈమధ్య కేసీఆర్ గారితో మీరు మాట్లాడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయింది.
ఆ టైంలో కేసీఆర్తో మీ కాన్వర్జేషన్ ఏంటి అని అడిగాడు. దాంతో నరేష్ ఆరోజు అక్కడ అసలు ఏం జరిగిందో వివరించారు. నరేష్ మాట్లాడుతూ.. ‘‘ఈ వీడియో గురించి బయట రకరకాలుగా మాట్లాడుకున్నారు. కేవలం క్లిక్స్ కోసం.. ఓ కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడు అలా పెట్టడం పాపం తగులుతుంది. అలా పెట్టింది ఎవరో నాకు తెలియదు. దేవుడు దయ వల్ల బాగుండాలి’’ అని అన్నారు.
ఆ రోజు జరిగింది వేరు..
‘‘ఆరోజు మహేష్ నా పక్కన కూర్చున్నాడు. మరోపక్క కేసీఆర్ కూర్చున్నారు. సంతోష్ నన్ను పిలిచారు. మేమిద్దరం ఫ్రెండ్స్. అఫీషియల్ గన్ ఫైరింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరైనా చనిపోతే గవర్నమెంట్ అఫీషియల్ గన్ ఫైర్ హానర్ ఇస్తుంది. ఇది స్టేట్ లోనే ఒక అరుదైన గౌరవం. జనరల్ గా దీన్ని ఎవరో ఒకరు గవర్నమెంట్ కి రికమండ్ చేస్తారు. మన స్టేట్ సీఎంకి రికమెండ్ చేస్తే అప్పుడు సీఎం అందుకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఇదే విషయాన్ని సంతోష్ నాకు చెబుతూ.. మీకు తెలుసా ఈ విషయం ఎవరి రికమండేషన్ లేకుండా కృష్ణ మీద ఉన్న అభిమానంతో మన సీఎం ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ మర్యాదలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం ఒకసారి మహేష్ కి చెప్పండి అని నాతో అన్నారు’’ అని నరేష్ తెలిపారు.
‘‘ఆ విషయాన్నినేను మహేష్ దగ్గరికి వెళ్లి చెప్పా. బాధలో ఉండటం వల్ల మహేష్ నేను చెప్పింది అర్థం చేసుకోలేకపోయాడు. మహేష్ ఇలా సీఎం గారు స్టేట్ హానర్స్ ఇవ్వాలని స్వయంగా నిర్ణయం తీసుకున్నారని చెప్తే.. అప్పుడు మహేష్ నమస్కారం చేస్తూ.. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అన్నాడు. దాంతో నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లి నిజంగా మీకు పాదాభివందనాలు సర్, థాంక్స్ అని నమస్కారం చేశాను. అప్పుడు కేసీఆర్ నన్ను ఆపి కాదమ్మా.. అది నా మనసు నుంచి వచ్చింది. కాబట్టి అలా నువ్వు అనొద్దు అని అన్నారు. అది అక్కడ జరిగింది’’ అని నరేష్ ఆ రోజు జరిగిన విషయాన్ని వివరించారు.
‘‘కేవలం క్లిక్స్ కోసం ఆ వీడియోని సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేశారు. అది కరెక్ట్ కాదు. మంచి కంటెంట్ ఇవ్వండి. ఆ కంటెంట్ కి మంచి క్యాప్షన్ కూడా పెట్టండి. కానీ ఇలాంటివి చేయకండి" అంటూ నరేష్ చెప్పుకొచ్చారు.
Also Read: నేరుగా ఓటీటీలోకి విజయ్ సేతుపతి ఫస్ట్ బాలీవుడ్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు!