సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ‘యానిమల్’ అనే సినిమా.. చాలామంది ప్రేక్షకులను తెగ ఇంప్రెస్ చేసింది. భాషతో సంబంధం లేకుండా చాలామంది ప్రేక్షకులు.. ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే ఆ క్రెడిట్ కేవలం సందీప్‌ది మాత్రమే కాదు.. అందులో నటించిన ప్రతీ నటీనటులది. ప్రతీ పాత్రను సందీప్ ఎంత జాగ్రత్తగా రాసుకున్నాడు అనే విషయం సినిమా చూసినవారికి అర్థమవుతుంది. అయితే ఇందులో విలన్‌గా నటించిన బాబీ డియోల్‌ను ముస్లింగా చూపించాడు దర్శకుడు. అసలు దాని వెనుక కారణం ఏంటో తాజాగా రివీల్ చేశాడు. ‘యానిమల్’ సక్సెస్ తర్వాత కూడా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్న సందీప్.. ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు.


మతాలపై సందీప్ కామెంట్..
‘‘కొంతమంది తమ కాన్ఫిడెన్స్‌ను పూర్తిగా కోల్పోవడం నేను దగ్గరుండి చూశాను. అలాంటి సమయంలోనే కొందరు వారికి చర్చికి వెళ్లు లేదా బాబా దగ్గరకు వెళ్లు ఆయన నీకు తాయత్తు ఇస్తాడు, నీ పేరు మారుస్తాడు అని సలహాలు ఇస్తుంటారు. వారి జీవితాల్లో అనుభవాలను బట్టి మతాలు మార్చుకున్న మనుషులను కూడా నేను చూశాను. అలా చేసిన తర్వాత వారు మళ్లీ పుట్టినట్టు భావిస్తారు. వారి గుర్తింపు మొత్తం మారిపోయింది అనుకుంటారు. చాలామంది ఇస్లాంలోకి, క్రిస్టియానిటీలోకి మారడం చూసే ఉంటాం. కానీ ఎవరూ హిందూ మతంలోకి మారడం మాత్రం మనం చూసుండం’’ అంటూ తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా.


అది నా ఉద్దేశంతో కాదు


‘‘ఇస్లాంలో ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉండవచ్చు. అంటే హీరోకు బంధువుల సంఖ్య పెరుగుతుంది. అలా అయితే డ్రామా ఎక్కువగా పండించవచ్చని అనుకున్నాను. అంతే కానీ ముస్లింను తప్పుగా చూపించాలన్నది నా ఉద్దేశ్యం కాదు’’ అని సందీప్ క్లారిటీ ఇచ్చాడు. బాబీ డియోల్ కూడా తాను పోషించిన అబ్రార్ పాత్రపై మునుపటి ఇంటర్వ్యూలలో స్పందించాడు. ‘‘నేను ఆ పాత్రను భయంకరంగా చూడలేదు. తాత తనను తాను కాల్చుకొని చనిపోతుండగా.. కళ్లారా చూసిన వ్యక్తిగానే భావిస్తున్నాను. దానివల్లే తన గొంతు పోయింది. తను తన ప్రతీకారం తీర్చుకోవాలని చూసే వ్యక్తే అయినా.. ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు. తన కుటుంబం కోసం ఎవరినైనా చంపడానికి సిద్ధంగా ఉంటాడు. అలా నేను నా పాత్ర కోసం ప్రిపేర్ అయ్యాను. అందుకే నేను నటిస్తున్నప్పుడు ఆ నటన చాలా నేచురల్‌గా వచ్చినట్టు అనిపిస్తుంది’’ అని తన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు బాబీ డియోల్.


ఇప్పటికీ సక్సెస్‌ఫుల్ రన్‌తో..


డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలయిన ‘యానిమల్’.. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్ రన్‌ను కొనసాగిస్తోంది. 3 గంటల 21 నిమిషాల నిడివితో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలిసినప్పుడు అసలు అంత పెద్ద సినిమా ఎవరైనా చూస్తారా అని విమర్శించినవారే ఇప్పుడు మళ్లీ మళ్లీ ఈ మూవీని చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు. ఇందులో రణబీర్ పాత్రకు ఎంత క్రేజ్ లభించిందో.. బాబీ డియోల్ పాత్రకు కూడా అంతే క్రేజ్ లభించింది. హీరోయిన్‌గా రష్మికను ఎంత ప్రశంసిస్తున్నారో.. సెకండ్ హీరోయిన్‌గా నటించిన తృప్తికి కూడా అదే రేంజ్‌లో ఆదరణ లభిస్తోంది.


Also Read: వైఎస్ జగన్ బర్త్ డే స్పెషల్, ‘యాత్ర 2‘ నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల