పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తరువాతి చిత్రం ‘సలార్’ విడుదలకు ఇంకా ఒకరోజు సమయం ఉన్నా కూడా మూవీ టీమ్ ప్రమోషన్స్‌పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటివరకు మూవీని ప్రమోట్ చేయడం కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కలిసి ఒకేఒక్క ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అది కూడా రాజమౌళి హోస్ట్ చేశాడు. ఇంటర్వ్యూ చూసినవారు ప్రేక్షకుల్లో హైప్ పెరగడానికి ఈ ఒక్క ప్రమోషన్ చాలు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ‘సలార్’ టీమ్.. తమ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. అంతే కాకుండా ఇతర ఫిల్మ్ మేకర్స్ గురించి, వారి పనితీరు గురించి కూడా ప్రస్తావించారు.


లోకేశ్ కనకరాజ్‌పై ప్రశంసలు


డిసెంబర్ 22న ‘సలార్’ విడుదలకు సిద్ధమయ్యింది. ఆన్‌లైన్‌లో టికెట్స్ అమ్మకం కూడా మొదలయ్యింది. కానీ ప్రమోషన్స్ మాత్రం చాలా డల్‌గా నడుస్తున్నాయి. చెప్పాలంటే అసలు ప్రమోషన్స్‌పై ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు ‘సలార్’ టీమ్. అందుకే రాజమౌళితో ఒకేఒక్క ఇంటర్వ్యూలో చేసి.. అందులోనే మూవీకి సంబంధించిన మేజర్ సమాచారం అంతా బయటపెట్టారు. ఈ ఇంటర్వ్యూలో ప్రశాంత్, ప్రభాస్, పృథ్వి కలిసి ప్రేక్షకులను ‘సలార్’ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయారు. ఆ సందర్భంలో సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రస్తావన వచ్చింది. సినిమాటిక్ యూనివర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ గురించి రాజమౌళి, ప్రశాంత్ నీల్ చర్చించారు.


నీల్ సినిమాటిక్ యూనివర్స్


‘సలార్’ నీల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమని, దానికి ‘కేజీఎఫ్’కు కనెక్షన్ ఉంటుందని ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ తనకు అంత సీన్ లేదని ఓపెన్‌గా చెప్పేశాడు ప్రశాంత్. తన సినిమాల్లోని పాత్రలను కనెక్ట్ చేసే విషయంలో లోకేశ్ క్రియేటివిటీ అద్భుతంగా ఉంటుందని ప్రశంసించాడు. సినిమాటిక్ యూనివర్స్ అనే ట్రెండ్ తీసుకొచ్చిందే లోకేశ్ అని అన్నాడు. ఒకవేళ ఆ ట్రెండ్‌ను ఫాలో అవ్వాలనుకుంటే తాను కూడా చాలా కష్టపడాలి అని ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు. 


‘సలార్’లో రాకీ భాయ్ ఉంటాడా..?


‘సలార్’లోని దేవాను, ‘కేజీఎఫ్’లోని రాకీ భాయ్‌ను కలిసి ఒకే స్క్రీన్‌పై చూడొచ్చని ఆశించిన ఫ్యాన్స్‌కు చివరికి నిరాశే మిగిలింది. ‘కేజీఎఫ్’ అనేది 1980ల్లో జరిగిన కథ అని, ‘సలార్’ అనేది ఇప్పటికాలం కథ అని, రెండిటికీ అసలు ఏ మాత్రం కనెక్షన్ లేదని దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తిగా క్లారిటీ ఇచ్చాశాడు. తాజాగా ఒక మలయాళ సింగర్ కూడా ‘సలార్’లో యశ్ ఉన్నాడని రివీల్ చేసింది. కానీ ప్రశాంత్ మాత్రం అసలు ఆ మాటను ఒప్పుకోవడం లేదు. అయినా కూడా ప్రేక్షకులకు ఆశ మాత్రం పోవడం లేదు. కచ్చితంగా ‘సలార్’లో యశ్ గెస్ట్ రోల్ అయినా ఉంటుందని ఆశిస్తున్నారు. ఇంకా ఒక్కరోజు ఆగితే.. ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇక ఒక రేంజ్‌లో యాక్షన్, వైలెన్స్ ఉన్న కారణంగా సెన్సార్ బోర్డ్.. ‘సలార్’కు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది.


Also Read: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఈ విషయాలు తెలుసా? నటి మాత్రమే కాదు వ్యాపారి కూడా!