సమంత ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం'.  గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత, ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స లో బిజీగా ఉంది.


ఆకట్టుకుంటున్న 'శాకుంతలం' 3D ట్రైలర్


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో అభిమానుల నడుమ ఈ 3D ట్రైలర్ను విడుదల చేశారు. గుణశేఖర్ దర్శకత్వ ప్రతిభకు ఈ ట్రైలర్ అద్దం పడుతోంది. అద్భుత దృశ్యరూపకంగా తెరకెక్కింది. సినీ అభిమానులను బాగా అలరిస్తోంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఓరేంజిలో పెంచేసింది. ఈ వేడుకలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు గుణశేఖర్ సహా చిత్ర బృందం పాల్గొన్నది.


పాటలకు మంచి స్పందన


మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆల్రెడీ విడుదలైన 'మల్లికా.... మల్లిక', 'ఏలేలో ఏలేలో...', 'ఋషి వనములోన...' పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు సైతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ మూవీలో సమంత లుక్ కు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్లను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫోటోలలో సమంత ఒంటినిండా బంగారంతో ధగధగా మెరుస్తూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


14 కిలోల బంగారంతో నగల తయారీ




ఈ సినిమాలో సమంత ధరించిన బంగారం గురించి ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు దర్శకుడు గుణశేఖర్. సాధారణంగా సినిమాల్లో నకిలీ నగలనే వాడుతూ ఉంటారు. కానీ ‘శాకుంతలం’ సినిమాలో అన్నీ ఒరిజినల్ నగలనే వాడామని చెప్పారు. ఈ మూవీలో శకుంతల, దుష్యంతుల పాత్రలు చాలా కీలకమని అందుకే ఆ పాత్రలను రూపుదిద్దడానికి ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు దర్శకుడు గుణశేఖర్. అందుకోసం కేజీల కొద్దీ ఒరిజినల్ బంగారాన్ని ఉపయోగించినట్లు చెప్పారు. వాటి విలువ సుమారు 14 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. ఓ ప్రముఖ బంగారు నగల షోరూమ్ వారితో మాట్లాడి.. వాటిని చేయించామని చెప్పారు. వాళ్లు దాదాపు ఆరేడు నెలలు శ్రమించి 14 కేజీల బంగారాన్ని వాడి వీటిని తయారు చేశారని తెలిపారు.


ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో డిఆర్పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించారు. ఇంకా దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు నటించారు.


Read Also: అట్లుంటది గుణశేఖర్‌తో - 'శాకుంతలం' కోసం ఎన్ని కేజీల బంగారం వాడారో తెలుసా?