Trolls on Saindhav Trailer: సినిమాల్లో లాజిక్స్ చూడకూడదు అంటుంటారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో అస్సలే చూడకూడదు. కానీ ఈమధ్య ప్రేక్షకులు లాజిక్స్‌నే ఎక్కువగా పట్టించుకుంటున్నారు. అందుకే లాజిక్ లేని సినిమాలు, సీన్స్... సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం వెంకటేశ్ హీరోగా నటించిన ‘సైంధవ్’ మూవీ కూడా అందుకే ట్రోలింగ్‌కు గురవుతోంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. అయితే ఈ ట్రైలర్‌లోని ఒక సీన్‌లో హీరో గన్ పేల్చే షాట్ ఉంది. దానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవ్వగా అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందో శైలేష్ ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.


వైలెన్స్ డోస్ పెంచేసిన ఫ్యామిలీ హీరో..
మామూలుగా వెంకటేశ్ ఫ్యామిలీ సినిమాలే చేస్తారని ప్రేక్షకుల్లో బలంగా ఒక అభిప్రాయం ఉండిపోయింది. సీనియర్ హీరోలు అందరిలో ఎక్కువగా ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ నటుడు కూడా వెంకటేశే. అందుకే తను రాసుకున్న ‘సైంధవ్’ కథకు వెంకటేశే కరెక్ట్ అని, తనను హీరోగా పెడితే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు అని దర్శకుడు శైలేష్ కూడా రివీల్ చేశాడు. ఇది ఒక తండ్రి, కూతురి మధ్య సాగే కథ. కానీ ఈ కథలోనే చాలా వైలెన్స్ ఉందని ఇటీవల విడుదలయిన ‘సైంధవ్’ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ వయొలెన్స్ వల్లే సినిమాకు యూ/ఏ సెర్టిఫికెట్ కూడా వచ్చింది. అయితే ఈ ట్రైలర్‌లో హీరో.. ఒక వ్యక్తిని గన్‌తో కాల్చిన షాట్ ఉంది. ఆ షాట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.










బయాలజీ ఆన్సర్‌తో వివరణ..
‘సైంధవ్’ ట్రైలర్‌లో హీరో వెంకటేశ్.. ఒక వ్యక్తిని గన్‌తో నోట్లో కాలుస్తాడు. ఆ బులెట్ తన వెనక నుంచి బయటికి వస్తుంది. ఇక ఈ షాట్ నెటిజన్లకు చాలా ఫన్నీగా అనిపించడంతో దీనిని తెగ ట్రోల్ చేసేస్తున్నారు. అలాంటి ఒక పోస్ట్ శైలేష్ కొలను కంటపడింది. అది చూసి నవ్వుకున్న శైలేష్.. ఆ తర్వాత బులెట్ అసలు అలా ఎలా బయటికి వచ్చింది అని వివరించాడు. మామూలుగా బులెట్ నోట్లో కాలిస్తే.. తల నుంచి బయటికి రావాలని, కానీ తను వేసిన లెక్కల ప్రకారం నోట్లో 80 డిగ్రీలలో గన్ పెట్టి కాలిస్తే అలా వెనుక నుంచి బయటికి వస్తుందని అన్నాడు. అంతే కాకుండా దాని గురించి వివరిస్తూ ఒక పెద్ద బయాలజీ ఆన్సర్‌ను ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఆ సీన్‌ కంటే శైలేష్ వివరణే ఫన్నీగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.






జనవరి 13న విడుదల..
ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైంధవ్’.. జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో వెంకటేశ్‌కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. విలన్స్‌గా ముఖేష్ రిషీ, నవాజుద్దీన్ సిద్ధికీ, ఆర్య కనిపించనున్నారు. రుహానీ శర్మ, ఆండ్రియాలాంటి హీరోయిన్లు కూడా ‘సైంధవ్’లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలతో కలిసి ‘హిట్‌వర్స్’ అనే థ్రిల్లర్ ప్రపంచాన్ని సృష్టించాడు శైలేష్. ఇక మొదటిసారి తన కెరీర్‌లో ‘సైంధవ్’తో వెంకటేశ్‌లాంటి సీనియర్ హీరోను డైరెక్ట్ చేశాడు. మెడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా విజయంపై మూవీ టీమ్ నమ్మకంతో ఉంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. బేబీ సారా పాలేకర్ పాత్ర చుట్టూనే ‘సైంధవ్’ సినిమా తిరుగుతుంది.


Also Read: ఒక్క హగ్ కోసం రజినీకాంత్ అంత గలాటా చేశారు - రంభ షాకింగ్ కామెంట్స్