Jr. NTR Speech at Tillu Square Success Meet: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'టిల్లు స్క్వేర్'. ఇది 2022లో వచ్చిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్. మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.  మార్చి 29న విదుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్  రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిల్లు పాత్ర మనందరి జీవితాల్లో ఒక భాగమైందన్నారు. 'డీజే టిల్లు'తో సిద్ధు కేవలం విజయాన్ని అందుకోవడమే కాదు, మనకు కలకాలం మిగిలిపోయే ఒక మంచి పాత్రను ఇచ్చాడని కొనియాడారు.  


ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''సిద్ధు నటించిన సినిమాలు చూశాను కానీ, అతనిని పర్సనల్ గా ఎప్పుడూ ఇంటరాక్ట్ అవ్వలేదు. పాండమిక్ తర్వాతే మొదటిసారి సిద్ధుని కలవడం జరిగింది. సినిమా అంటే ఒక పిచ్చి ఉండే టెక్నీషియన్లు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మొట్ట మొదటి వరుసలో ఉంటాడు సిద్ధు. తనకి సినిమా తప్ప వేరే ఏమీ తెలీదు. డీజే టిల్లు అనే క్యారక్టర్ ని చూసి అతను నిజ జీవితంలో కూడా ఇలానే ఉంటాడేమో అని మీరు అనుకోవచ్చు. కానీ సిద్ధు అలా కాదు. ఎంతసేపూ తన సినిమా, తను చేస్తున్న పాత్ర, తను రాస్తున్న కథ, ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన మాత్రమే ఉంటుంది. చాలా తక్కువమంది ఆర్టిస్ట్ లు, చాలా తక్కువమంది టెక్నీషియన్స్ లో ఈ తపనను చూస్తాం మనం. డీజే టిల్లు మూవీతో సిద్ధు కేవలం సక్సెస్ అందుకోవడమే కాదు, మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారక్టర్ ను ఇచ్చాడు'' అని అన్నారు. 


''చిన్నప్పుడు నేను టామ్ అండ్ జెర్రీ, హి మ్యాన్ లాంటి కార్టూన్స్ బాగా చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్స్ సినిమాల ద్వారా మన లైఫ్ లో మిగిలిపోతే బాగుంటుందని ఎప్పుడూ కోరుకునే వాడిని. ఈరోజు టిల్లు.. మన ఇంట్లో, మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు. హాట్సాఫ్ సిద్దు జొన్నలగడ్డ. మన ఇంట్లో ఉండిపోయి మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసినందుకు డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ టీం అందరినీ హ్యాట్సాఫ్. నవ్వించడం అనేది ఒక వరం నవ్వకపోవడం ఒక శాపం. బేసిక్ గా నేను నవ్వడం మొదలుపెడితే, దాన్ని ఆపుకోవడం చాలా కష్టం. నేను 'అదుర్స్' సినిమా చేస్తున్నప్పుడు వినాయక్ అన్న చాలా కష్టపడేవాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారు డైలాగ్ చెప్పకపోయినా, ఆయన్ని చూస్తేనే నేను నవ్వేసేవాడిని. 'అరవింద సమేత' షూటింగ్ అప్పుడు త్రివిక్రమ్ గారు కూడా ఇదే చాలాసార్లు ఫేస్ చేశారు. అలాంటిది ఈ సినిమాతో నేను ఎంత నవ్వానంటే.. నేనింక నవ్వలేను బాబోయ్ అనే అంతలా నవ్వించాడు సిద్దు. నన్నే కాదు చాలామందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ సిద్దుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు, ఇంకా చాలా అద్భుతమైన క్యారెక్టర్ లని క్రియేట్ చేయాలి. మనందరికీ అందించాలని, దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను'' అని తారక్ అన్నారు. 


''దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ గురించి చెప్పను కానీ.. ఆ సినిమాలో భయం గురించి ఎక్కువ శాతం మాట్లాడటం జరుగుతుంది. కల కనడానికి ధైర్యం ఉండాలి.. ఆ ధైర్యాన్ని, ఆ కలని సార్ధకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి. కుదిరితే సరిదిద్దండి.. లేదంటే క్షమించండి.. అంతేగాని నేనున్నానని గుర్తించండి.. ఇక్కడ మీరు, ఐ యాం టెల్లింగ్ దట్.. పోలే అదిరిపోలే(త్రివిక్రమ్ తో సరదాగా నవ్వుతూ). త్రివిక్రమ్ ని చూసి చాలా రోజులైంది. ఆయనను స్టేజి మీద చూస్తుంటే 'అరవింద సమేత రోజులు' గుర్తుకొస్తున్నాయి. మనిషికి కల కనడానికి ధైర్యం ఉండాలి, ఆ కలను నిజం చేసుకోవడానికి విపరీతమైన క్రమశిక్షణ ఉండాలి. ఇక్కడ క్రమశిక్షణ అంటే భయం. ఈరోజు టిల్లు చిత్ర బృందం మొత్తం అంత భయపడుతూ, భక్తి శ్రద్ధలతో ప్రేక్షకులకి నచ్చే సినిమాని అందించాలని కష్టపడ్డారు కాబట్టి.. అంతటి ఘన విజయం లభించింది'' అని అన్నారు. 


''కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. కష్టానికి కొలమానం లేదు. నా కష్టం నీ కష్టం వేరు కాదు.. అది ఎవరికైనా ఒకటే. ఆ కష్టాన్ని ఇలాగే ఎప్పుడూ నమ్ముకో.. అది నిన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది'' అంటూ సిద్ధుని ఉద్దేశిస్తూ చెప్పారు ఎన్టీఆర్. ''నేను సిద్ధుకి, విశ్వక్ కి చాలాసార్లు చెప్పాను. నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది. మీ ఇద్దరి కొత్త ఐడియాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతారు. ఇండస్ట్రీకి మీరిద్దరూ ఎంతో ఉపయోగపడతారని చాలాసార్లు వాళ్లకి చెప్పాను. ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే.. చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇలాంటి డేర్ డెవిల్స్ ఇండస్ట్రీకి కావాలి. వాళ్ళిద్దరికీ హ్యాట్సాఫ్'' అని అన్నారు. 


ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''టిల్లు స్క్వేర్ సినిమాకి దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ కి హ్యాట్సాఫ్. ఒక బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ రూపొందించడం అంత తేలికైన విషయం కాదు. ఈ సీక్వెల్ ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడికి కంగ్రాట్స్. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ కంగ్రాట్స్. కాసర్ల శ్యామ్ రాసే పాటలంటే నాకు ఇష్టం. 'బలగం'లో ఊరు పల్లెటూరు పాటంటే చాలా ఇష్టం. ఆయన రాసే పదాల నుంచి మట్టి వాసన వస్తుంది. అలాగే రాధిక పాత్రలో నేహా శెట్టి, అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించారు. వాళ్లిద్దరూ లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించేది కాదు. వంశీ నిర్మాతగా ఇంకా ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను. వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే అతనికి దిష్టి తగులుతుంది. 'దేవర' సినిమా రిలీజ్ లేట్ అయినా సరే మీరు అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా అందించడానికి ప్రయత్నిస్తాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను." అంటూ ముగించారు.



Also Read: విజయ్ దేవరకొండ నుంచి సిద్ధు జొన్నలగడ్డ వరకూ.. రూ.100 కోట్లు కొట్టిన కుర్ర హీరోలు వీరే!