iSmart Shankar Movie: టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. రామ్ ని కంప్లీట్ మాస్ మసాలా రోల్ లో చూపించి దానికి మెడికల్ టెక్నాలజీని లింక్ చేస్తూ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో పూరి డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు. సినిమాలో హీరో రామ్ మెదడులో బ్రెయిన్ షిప్ ఇంప్లాంట్ చేయడం తెలిసిందే కదా. అది సినిమా కాబట్టి చెల్లింది. నిజంగా రియల్ లైఫ్ లో ఇలా ఉంటుందా? అని సినిమా చూసిన చాలా మంది అప్పట్లో అనుకున్నారు.


అయితే ఇప్పుడు నిజ జీవితంలో దీన్ని నిజం చేయబోతున్నారు ఎలన్ మాస్క్. ఇప్పటికే మనం రీల్ లైఫ్ లో చూసిన ఇస్మార్ట్ శంకర్ ని రియల్ లైఫ్ లో రెడీ చేశారు. ఎర్లీ రిజల్ట్స్ పాజిటివ్ అని కూడా చెప్పారు. ఎలన్ మస్క్ ఓ వ్యవస్థాపకుడిగా ఉన్న న్యూరో లింక్ కంపెనీ ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఓ మనిషి మెదడులో వైర్లెస్ చిప్ అమర్చారు. ఆ ప్రయోగం అనంతరం మెదడు కార్యకలాపాలు గుర్తించామని, ఆపరేషన్ సక్సెస్ అయిందని, పేషెంట్ కూడా కోలుకున్నారని స్వయంగా ఎలన్ మాస్క్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మన మెదడుని కంప్యూటర్స్ కి కనెక్ట్ చేసే నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించాలనేదే తమ లక్ష్యం అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ‘ఇస్మార్ట్ శంకర్‌’లో ఆ చిప్ ద్వారా వేరే వ్యక్తి ఆలోచనలు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. భవిష్యత్తులో రియల్‌గా కూడా అది సాధ్యం కావచ్చు. 


ఇక పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఈ ప్రక్రియని డీటెయిల్ గా వివరించారు. పూరి జగన్నాథ్ సినిమా కథని ఎలెన్ మాస్క్ నిజం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మనిషి మెదడులో చిప్ మార్చడం అనేది కలలో కూడా ఊహించడానికి కష్టం అనే భ్రమలో ఇన్నాళ్లు ఉండిపోయారు. కానీ ఇప్పుడు అది నిజమైంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకెన్ని ప్రయోగాలు చేస్తారో చూడాలి. ఇదంతా టెక్నాలజీ మహిమే. ఇక రామ్ - పూరీ జగన్నాథ్ కలిసి ఇదే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' చేస్తున్నారు. ఈ సీక్వెల్ కథ కూడా ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీ మీదే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కూడా అదే విధంగా మరో ప్రయోగం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 


ఇక 'డబుల్ ఇస్మార్ట్' సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ మరోసారి ఈ సీక్వెల్ కి మ్యూజిక్ అందిస్తున్నారు. మొదట శివరాత్రి కానుకగా మార్చి 8న ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. కానీ సినిమాకు సంబంధించి ఇంకా పెండింగ్ వర్క్ ఉండడంతో మే నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.


Also Read : ఆ హీరోతో హ్యాట్రిక్‌కు రెడీ అయిన అనిల్ రావిపూడి!