మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఓవైపు కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తూనే మరోవైపు కొత్త ప్రాజెక్ట్స్ ను ప్రకటిస్తున్నాడు. అలా ఒకే ఏడాదిలో కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాడు. గత ఏడాది చివర్లో 'ధమాకా' సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న రవితేజ ఈ ఏడాది ఆరంభంలో 'వాల్తేరు వీరయ్య' తో మరోసారి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన 'రావణాసుర' ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageshwararao) గా ప్రేక్షకులు ముందుకు దూసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు.


స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. రవితేజ కెరీర్లో మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసాయి. దసరా కానుకకా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ సినిమాపై వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను తారస్థాయికి చేరుస్తున్నారు. ఇప్పటికే 'టైగర్ నాగేశ్వర రావు' ట్రైలర్ ని అక్టోబర్ 3న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.






అయితే ట్రైలర్ కన్నా ముందు 'మేం క్రియేట్ చేసిన టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని చూడండి' అన్నట్లుగా స్టువర్టుపురం గ్రామానికి సంబంధించిన కొన్ని మేకింగ్ స్టిల్స్, సెట్ వర్క్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మూవీ టీం. ఈ సెట్ కోసం మేకర్స్ భారీగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెట్ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మాస్ మహారాజా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో థియేటర్స్ లో మాస్ జాతర ఖాయమంటూ చెబుతున్నారు.


1970 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రవితేజ సరసన బాలీవుడ్ హీరోయిన్ నుపుర్ సనన్ కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గాయత్రీ భరద్వాజ్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇందులో రవితేజ సోదరి హేమలత లవణం అనే పాత్ర పోషిస్తుంది. అనుపమ్ ఖేర్, రావు రమేష్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.


Also Read : 'స్కంద' ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - రామ్, బోయపాటి ముందున్న టార్గెట్ ఎంతంటే?