'ఆర్ ఆర్ ఆర్' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ చేంజర్'.(Game Changer) దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి 'గేమ్ చేంజర్' షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాని ప్రకటించి చాలా కాలం అవుతున్నప్పటికీ కనీసం ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అప్పుడెప్పుడో టైటిల్ అనౌన్స్మెంట్ అంటూ ఓ చిన్న వీడియో రిలీజ్ చేశారు.


ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో మూవీ టీం పై రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దానికి తోడు షూటింగ్ కూడా పలుమార్లు వాయిదా పడుతోంది. వీటన్నిటికీ కారణం శంకర్ రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణం చేస్తుండటమే. అంటే ఓవైపు 'ఇండియన్ 2' మరోవైపు 'గేమ్ చేంజర్' ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరుగుతున్నాయి. సాఫీగా సాగుతున్న 'గేమ్ ఛేంజర్' షూటింగ్ మధ్యలో 'ఇండియన్ 2' మూవీని తీసుకొచ్చాడు శంకర్. దాంతో గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ బడ్జెట్ కూడా పెరుగుతూ వస్తోంది. 'ఇండియన్ 2' పై క్లారిటీ ఇస్తున్నప్పటికీ 'గేమ్ చేంజర్' షూటింగ్ అసలు ఎక్కడ వరకు వచ్చిందో మాత్రం స్పష్టత రావడం లేదు.


దానికి తోడు సినిమా నుంచి లీక్స్ కూడా ఎక్కువైపోవడంతో ఫ్యాన్స్ ఈ విషయంలో తీవ్ర నిరాశ చెందుతున్నారు. రీసెంట్ గానే కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కించిన ఓ సాంగ్ కూడా అనూహ్యంగా లీకై బయటకు వచ్చేసింది. అలా సినిమాకి తరచూ ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈరోజు (సెప్టెంబర్ 24) న జరగాల్సిన 'గేమ్ చేంజర్' లేటెస్ట్ షెడ్యూల్ మళ్లీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.






" కొంతమంది నటీనటుల డేట్స్ దొరకకపోవడంతో (నడినటులు అందుబాటులో లేనందున) గేమ్ చేంజర్ సెప్టెంబర్ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. తిరిగి అక్టోబర్ రెండో వారంలో షూటింగ్ మొదలవుతుందని" ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ పేర్కొంది. దీంతో ఈ న్యూస్ విని మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. చివరి నిమిషంలో దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ క్యాన్సల్ చేయడం గమనార్హం గా మారింది. ఇలా షెడ్యూల్స్ పదేపదే వాయిదా పడితే సినిమా షూటింగ్ ఎప్పటికీ పూర్తవుతుందో? ఎప్పుడు రిలీజ్ అవుతుందో? కూడా తెలియని పరిస్థితి.


నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సినిమా కోసం 2024 వేసవి వరకు ఎదురు చూడాల్సిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ కి జోడిగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. తమన్ సంగీతమందిస్తున్నారు.


Also Read : డ్రగ్స్ కేసులో ముగిసిన నవదీప్ విచారణ, ఆరు గంటల పాటు ప్రశ్నల వర్షం !




Join Us on Telegram: https://t.me/abpdesamofficial