Operation Valentine Trailer Out Now: వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రమే ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కించారు మేకర్స్. మార్చి 1న తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఫైనల్ స్ట్రైక్’ అనే పేరుతో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయించారు మేకర్స్. ఇక ‘ఆపరేషన్ వాలెంటైన్’ హిందీ ట్రైలర్‌ను సల్మాన్ ఖాన్ విడుదల చేశాడు. టీజర్ కంటే ట్రైలర్‌లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలను జతచేశాడు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్.


టైటిల్ వెనుక కథ..


అసలు ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే విషయాన్ని ట్రైలర్‌లో రివీల్ చేశారు మేకర్స్. 2019లో ఫిబ్రవరీ 14న ఇండియన్ ఆర్మీపై జరిగిన పుల్వామా అటాక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగనుందని తెలుస్తోంది. ఆరోజు ఆర్మీపై జరిగిన అటాక్‌కు సమాధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. పాకిస్థాన్ల‌లోకి చొరబడి వారి క్యాంప్‌లపై దాడి చేసి గట్టి సమాధానమే చెప్పింది. ఆ ఘటనలో ఎయిర్ ఫోర్స్ ఎలా పనిచేసింది అనే అంశాన్ని ‘ఆపరేషన్ వాలెంటైన్’లో స్పష్టంగా చూపించారు. పాకిస్థాన్ చేసిన దాడికి ఎదురుదాడిని ప్లాన్ చేసి దానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఆపరేషన్ వాలెంటైన్ అనే పేరు పెట్టినట్టుగా ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. కొన్ని సీన్స్ చూస్తే తప్పకుండా లేచి సెల్యూట్ చేస్తారు.


గర్వంగా అనిపిస్తోంది..


‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ట్రైలర్ ప్రారంభంలోనే తను ఒక భయం లేని ఆఫీసర్‌గా చూపించారు. ఎన్నో కష్టమైన ఆపరేషన్స్ చేసినందుకు తన ఒంటి నిండా గాయాలు ఉన్నట్టుగా చూపించారు. ఇక తనను ప్రేమించే వ్యక్తిగా మానుషీ చిల్లర్ నటించింది. తనతో పాటు రుహానీ శర్మ కూడా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ‘ఆపరేషన్ వాలెంటైన్’కు సంబంధించిన ట్రైలర్‌ను తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు రామ్ చరణ్. ‘ఓపీవీ ఫైనల్ స్ట్రైక్ వచ్చేసింది. చాలా భారీగా కనిపిస్తోంది. ఇలాంటి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్నందుకు నా తమ్ముడు వరుణ్ తేజ్‌ను చూస్తే చాలా గర్వంగా అనిపిస్తోంది. ఈసారి ఈ సినిమా మొత్తం దేశాన్ని గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది’ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.






అందమైన ప్రేమకథ..


మార్చి 1న ‘ఆపరేషన్ వాలెంటైన్’ను థియేటర్లలో చూడడానికి ఎదురుచూస్తున్నట్టు రామ్ చరణ్ తెలిపారు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇది ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కథే అయినా.. ఇందులో అందమైన ప్రేమకథ కూడా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘రాడార్‌లో నువ్వు ఉన్నంత వరకు నాకేం కాదు’ అని వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్.. ట్రైలర్‌లో మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. గాల్లో యుద్ధ విమానాల విన్యాసాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేసినా.. ట్రైలర్‌లో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.


Also Read: రకుల్‌కు కాబోయే భర్త స్పెషల్ సర్‌ప్రైజ్, పెళ్లిలో ఆ సీనియర్ నటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్