Project K First Look Poster: ఇటీవలే 'ఆదిపురుష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ సారైనా హిట్ కొట్టాలన్న సంకల్పంతో 'ప్రాజెక్ట్ కె'తో వస్తున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి ఇటీవలే ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ లుక్ పై ఊహించని రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఆ పోస్టర్ ను డిలీట్ చేసి, మరో కొత్త పోస్టర్ ను పోస్ట్ చేసింది.


ప్రభాస్, దీపికా పదుకునే జంటగా నటిస్తోన్న 'ప్రాజెక్ట్ కె'లో.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో.. విశ్వ నటుడు కమల్ హాసన్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ నటిస్తున్నట్లు.. 'ప్రాజెక్ట్ కె' టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ వీడియోను, ఓ పోస్టర్ ను కూడా మూవీ టీమ్ విడుదల చేసింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. జనవరి 12, 2024న థియేటర్లలో విడుదల కానుంది.  


'ప్రాజెక్ట్ కె'కు సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ జూలై 19న రిలీజైంది. అయితే ఈ పోస్టర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గ్రాఫిక్స్‌లో ప్రభాస్ తలను అతికించినట్లుగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. దీని కంటే ఆదిపురుష్ పోస్టరే బాగుందంటూ కామెంట్లు వచ్చాయి. దీంతో వైజయంతీ మూవీస్.. ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిలీట్ చేసి.. దాని స్థానంలో మరో పోస్టర్ ను పంచుకున్నారు. ముందుగా షేర్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ టాప్ బన్‌తో, పూర్తిగా ఆయుధాలతో కూడిన రోబోటిక్ బాడీతో కనిపించాడు. 'ప్రాజెక్ట్ K' అంటే ఏమిటి?' అనే క్యాప్షన్‌తో అతను నేరుగా కెమెరా వైపు చూస్తున్నటు చూపించారు. కొత్తగా అప్‌డేట్ చేసిన పోస్టర్‌లోనూ ప్రభాస్ అదే ఫోజులో కనిపించాడు. అయితే, ఫస్ట్ పోస్టర్‌లో బ్రైట్‌గా కనిపించిన ప్రభాస్ ఫేస్‌లో మార్పులు చేశారు. అలాగే, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న 'వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె' లైన్ కూడా తొలగించారు.






ఫ్యాన్స్ ఏమంటున్నారంటే...


తాజాగా పోస్ట్ చేసిన 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్ లుక్ పోస్టర్ పైనా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. "నాకు సాటిస్ ఫాక్షన్ గా లేదు. "బాగానే ఉంది కానీ ఎడిటింగ్ బాగాలేదు" అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. "అదే పోస్టర్.. అయితే "మునుపటి దాని కంటే ఇది పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది" అని మరొకరు రాసుకువచ్చారు. ఇక వైజయంతీ మూవీస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అంతే కాదు ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా కూడా నిలిచింది. 


వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తోన్న ప్రభాస్ కు.. కొంత కాలంగా హిట్ అనే మాట ఆమడంత దూరంలోకి వెళ్లిపోయింది. ఇటీవల విడుదలైన 'ఆదిపురుష్' కూడా అదే తరహా రెస్పాన్స్ ను అందుకుంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై ముందు నుంచే అంచనాలు కూడా భారీ స్థాయిలో నెలకొన్నాయి. దీనికి తోడు ప్రారంభం నుంచే ఈ సినిమా పలు వివాదాలను ఎదుర్కొంటూ వచ్చింది. అదే విడుదల తర్వాతా కంటిన్యూ అయింది. నటీనటుల పాత్రలు, వారి వేషధారణలు, కొన్ని సన్నివేశాలు, డైలాగులు సినీ ప్రేమికులను నిరాశలోకి నెట్టేశాయి. రామాయణాన్ని అపహాస్యం చేసేలా సినిమా తీశారని చాలా మంది విమర్శలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో చిత్రాన్ని కూడా రద్దు చేశారు. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద ప్రారంభంలో బాగానే కలెక్షన్లు వచ్చినా... ఆ తర్వాత మాత్రం బాగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో వస్తోన్న ప్రభాస్ నెక్స్ట్ సినిమాపై ఆయన ఫ్యాన్స్.. ఎప్పటిలాగానే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సారైనా తమ నమ్మకం ఒమ్ము కాకుండా ఉండాలని కోరుకుంటున్నారు.


Read Also : Project K Glimpse : బిగ్ బ్రేకింగ్ - 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ వచ్చేసింది, టైటిల్ కూడా చెప్పేశారు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial