కన్ను గీటిన వీడియోతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. 'ఓరు ఆధార్ లవ్' అనే సినిమాలో హీరోని చూస్తూ ఆమె కన్ను గీటిన సీన్ అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2019లో విడుదలైన ఈ సినిమా మళయాలంలో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమా 'లవర్స్ డే' పేరుతో రిలీజ్ అయింది. అయితే తాజాగా ‘‘ఆ కన్నుగీటే ఐడియా నాదే’’ అంటూ ఇటీవల ప్రియా ప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజానికి ఈ సినిమా విడుదలై సంవత్సరాలు గడుస్తున్నా, ఉన్నట్టుండి ఈ వైరల్ వింక్ చర్చకు రావడానికి అసలు కారణం ఏంటంటే.. ప్రియా ప్రకాష్ వారియర్, హీరోయిన్ మమతా మోహన్ దాస్ తో కలిసి ఇటీవల ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఓ సెగ్మెంట్ లో తనకి పాపులారిటీ తెచ్చి పెట్టిన వైరల్ వింక్ ను చేసి చూపించింది.


దాని అనంతరం ఈ కన్నుగీటే ఐడియా నాదే అని చెప్పింది. దాంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని చూసిన 'ఓరు ఆధార్ లవ్' దర్శకుడు ఓమర్ లూలూ  ఫేస్బుక్ వేదికగా ప్రియా ప్రకాష్ వారియర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. ‘‘పిచ్చి పిల్ల. ఐదేళ్ల కింద ఏం జరిగిందో పాపం మర్చిపోయినట్టుంది. వలియ చందనాది.. జ్ఞాపకశక్తి మెరుగుపడ్డానికి ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది’’ అంటూ ఆమెపై పలు వ్యంగ్యాస్త్రాలు విసిరాడు దర్శకుడు ఓమర్. అంతేకాకుండా వైరల్ వింక్ ఐడియా తన తోటి నటుడు రోషన్ దే అని 'ఓరు ఆధార్ లవ్' ప్రమోషన్స్లో భాగంగా ప్రియా వారియర్ చెప్పిన ఓ వీడియోని ఈ పోస్ట్ కి జత చేశాడు.


ఆ వీడియోలో ప్రియా వారియర్ మాట్లాడుతూ.."రోషన్ నాతో ఎంతో సరదాగా ఉంటాడు. అతను తరచూ కనుబొమ్మలు పైకెత్తి నన్ను ఆటపట్టించేవాడు. అది మా టీంకి బాగా నచ్చింది. అందుకే నన్ను కూడా అలాగే చేయమని అన్నారు. ఆ తర్వాత కన్ను గీటడం కూడా చేస్తే బాగుంటుందని సూచించారు. అలా వాళ్ళు చెప్పినట్టు నేను చేశాను. అది బాగా పాపులర్ అయ్యింది" అని ఆ వీడియోలో ప్రియ వారియర్ చెప్పుకొచ్చింది. దీంతో దర్శకుడు ఓమర్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


'ఓరు ఆధార్ లవ్' సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియా వారియర్ టాలీవుడ్ లో నితిన్ సరసన 'చెక్', తేజ సజ్జ సరసన 'ఇష్క్' వంటి సినిమాల్లో నటించింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది ఈ వింక్ బ్యూటీ. ఈ క్రమంలోనే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. సముద్రఖని తెరకెక్కిస్తున్న 'బ్రో' మూవీలో పవర్ స్టార్ కి జోడిగా నటిస్తోంది ప్రియా ప్రకాష్ వారియర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు.