ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'సలార్'(Salaar) మూవీ కోసం సినీ లవర్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కోసం ప్రశాంత్ నీల్ వైఫ్ ట్రైలర్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ అందించారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. 'కేజీఎఫ్' మూవీతో దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో సలార్ ఒకటి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలున్నా అందరి దృష్టి 'సలార్' పైనే ఉంది.


ఆ రేంజ్ లో ఈ మూవీ ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ చేసిన సలార్ టీజర్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. కేవలం 24 గంటల్లోనే సలార్ టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇక డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించడంతో ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య లిఖితారెడ్డి నీల్ 'సలార్' ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.


లిఖిత రెడ్డి నీల్ తన ఇన్ స్టాగ్రామ్ లో సలార్ ట్రైలర్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో.." రవి బస్రూర్ మ్యూజిక్ అండ్ మూవీ స్టూడియో నుంచి తీసింది. అందులో సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్ కట్ ప్రాసెస్ లో ఉంది" అని లిఖితారెడ్డి రాసుకొచ్చింది. దీంతో ఆ పిక్ కాస్త సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. సలార్ ట్రైలర్ కట్ పనులు జరుగుతున్నాయని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా సలార్ ట్రైలర్ ను డిసెంబర్ 1 రాత్రి 7:19 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు. దాదాపు రెండున్నర నుంచి మూడు నిమిషాల నిడివితో ఈ ట్రైలర్ ఉండనున్నట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే సలార్ మూవీలో 'కేజిఎఫ్' హీరో యశ్ క్యామియో రోల్ చేస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేజిఎఫ్ మూవీలో రాఖీ భాయ్ పాత్రని సలార్ లో చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. ఈ విషయం బయటికి రావడంతో కేజిఎఫ్ తో సలార్ కి లింక్ ఉంటుందని, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ మల్టీవర్స్ ని క్రియేట్ చేశారని రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. మరి వీటిల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. 


హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే నిర్మాణ సంస్థ రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుంది. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబు, ఈశ్వరి రావు, శ్రియ రెడ్డి, టీనూ ఆనంద్, సప్తగిరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Also Read : ఇన్ని వారాలు ఎలా ఉండగలిగావు అని ప్రశ్నించిన శ్రీకాంత్ - నరకంగా ఉంది, తలుపు తీస్తే వెళ్లిపోతానన్న శివాజీ!