పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ 'ఆదిపురుష్' ఎటువంటి గుట్టు చప్పుడు కాకుండా ఓటిటిలోకి వచ్చేసింది. మేకర్స్ దీనిపై ఎటువంటి ముందస్తు సమాచారం గానీ, ప్రమోషన్స్ కానీ చేయకుండా అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో 'ఆదిపురుష్' సినిమాని రిలీజ్ చేశారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో 'ఆదిపురుష్' తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హిందీ భాషలో స్ట్రీమింగ్ పై ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. హిందీ తప్ప మిగతా అన్ని భాషల్లో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, సినిమా ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.


'ఆదిపురుష్'ని అమెజాన్ ప్రైమ్ లో చూడాలంటే సబ్స్క్రిప్షన్ తో పాటు అదనంగా రూ.279 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా చూడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. వచ్చే వారం నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినా కూడా ఇప్పుడు ఓటీటీలో ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. రిలీజ్ కు ముందు 'ఆదిపురుష్' పై ఓ రేంజ్ లో హై క్రియేట్ అవడంతో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సుమారు రూ.250 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.






రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. రెట్రో ఫైల్స్ సమర్పణలో సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, జానకి దేవికా కృతి సనన్ నటించారు. ఇక రావణుడిగా బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించగా, హనుమంతుడిగా దేవదత్తా నగే, లక్ష్మణుడిగా సన్నిసింగ్ కనిపించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. ఆ తర్వాత నుంచి ఒక్కసారిగా కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. దీంతో ఈ ఏడాది నిర్మాతలకు నష్టాలను మిగిల్చిన సినిమాలో 'ఆదిపురుష్' కూడా ఒకటిగా నిలిచింది.


సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, రావణాసురుడి పాత్రతో పాటు ఇతర పాత్రల లుక్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు రామాయణాన్ని వక్రీకరించారంటూ, హిందువుల మనోభావాన్ని దెబ్బతీసారంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. 'సాహో, 'రాధే శ్యామ్' లాంటి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో తీవ్ర నిరాశలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ను 'ఆదిపురుష్' మరోసారి డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి.


Also Read :ఆమె ఇద్దరు పిల్లల తల్లి - నయనతారపై షారుఖ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial