కోలీవుడ్ అగ్ర హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఇటీవలే షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ అందుతుంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్' బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యికోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే జవాన్ సక్సెస్ తో నయనతార సినిమాలకు ఇప్పుడు మరింత డిమాండ్ పెరిగింది. ఇటీవల 'జవాన్' తో ప్రేక్షకులను అలరించిన నయనతార ఇప్పుడు త్వరలోనే 'ఇరైవన్'(Iraivan) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.


ఇందులో తమిళ స్టార్ హీరో జయం రవికి జోడిగా నయనతార నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సెప్టెంబర్ 28న విడుదల కాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేస్తుంది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకి సెన్సార్ టీం 'A' సర్టిఫికెట్ ఇవ్వడం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అంతేకాదు సినిమాలో ఎటువంటి కట్స్ లేకుండా జీరో కట్స్ తో సెన్సార్ 'A' సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. సాధారణంగా నయనతార సినిమాలకు ప్రతిసారి క్లీన్ యూ సర్టిఫికెట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ మొదటిసారి నయన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు మాత్రం 'A' సర్టిఫికెట్ రావడం ఆసక్తికరంగా మారింది.


సినిమాకి సెన్సార్ టీం 'A' సర్టిఫికెట్ ఇవ్వడానికి ప్రధాన కారణం.. సినిమాలో హింస ఎక్కువగా ఉండటమేనట. ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై దర్శకుడు అహ్మద్ ఈ చిత్రాన్ని సైకాలజీకల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించాడు. సినిమాలో క్రైమ్ సీన్స్ ని చాలా భయంకరంగా, హింసాత్మకంగా చూపించడంతో ఈ మూవీకి 'A' సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో అలాంటి సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఇప్పటికే ట్రైలర్ లో శాంపిల్ గా కొన్ని షాట్స్ చూపించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.


'రాక్షసుడు' మూవీ తరహాలో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా సాగనుందట. ముందుగా తమిళంలో విడుదల చేసిన తర్వాత సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ తర్వాత కొన్ని వారాలకు తెలుగులో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నయనతార సినిమాకి సెన్సార్ 'A' సర్టిఫికెట్ ఇచ్చింది అనే విషయం తెలియడంతో మాస్ ఆడియన్స్ లో ఈ మూవీ పై ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా 'A' సర్టిఫికెట్ సినిమాలు చూసేందుకు మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మరి నయనతార, జయం రవి జంటగా నటించిన 'ఇరైవన్' మాస్ ఆడియన్స్ ని ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.


Also Read : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial