తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నరేష్, పవిత్ర లోకేష్. ఈ జోడి కి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అన్ని ఇన్ని కావు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే నరేష్, పవిత్ర లోకేష్ జంటగా 'మళ్లీ పెళ్లి' అనే సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి గతంలో నరేష్ కొన్ని ఫోటోలను, పెళ్లి వీడియోలను షేర్ చేసి ప్రేక్షకుల్లో ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచాడు. ఇక ఈ సినిమాని ఎమ్.ఎస్. రాజు డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.


చాలామంది ఈ మూవీ ట్రైలర్ చూసి ఇది నరేష్ బయోపిక్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాని కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ, భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని భాషల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ టీం ప్లాన్ చేసింది.  ప్రస్తుతం నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే వరుస ప్రెస్ మీట్ లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న నరేష్..  ఈ ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత పవిత్ర లోకేష్ ని నరేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఇదే విషయంపై 'మళ్లీ పెళ్లి' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా క్లారిటీ ఇచ్చాడు నరేష్. త్వరలోనే పవిత్ర లోకేష్ ను తాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ బాంబు పేల్చాడు.


తాజాగా కన్నడ ప్రెస్ మీట్ లో భాగంగా నరేష్ మాట్లాడుతూ.. "నిజానికి పెళ్లి అనేది కచ్చితంగా అవసరం లేదు. చాలామంది ఇష్టం లేకుండా సమాజం కోసం పెళ్లి అనే బంధం లో ఉంటున్నారు. అలాంటి వాళ్ల కోసమే ఈ సినిమా. పెళ్లి అంటే తాళిబొట్టు, మెట్టెలు కాదు. అవి కేవలం సంకేతాలు మాత్రమే. పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం. నాకు పవిత్రకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ మా మనసులు కలిశాయి. అందుకే మేము కలిసి హ్యాపీగా ఉంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాం. అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ఈ సినిమా నా బయోపిక్ అని అందరు అనుకుంటున్నారు. కానీ ఇది నా బయోపిక్ కాదు. ట్రైలర్ చూసి సినిమాని అంచనా వేయకండి. సినిమా చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది" అంటూ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు నరేష్. ఇక విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు. మే 26న ఈ సినిమా విడుదల కానుంది.


Also Read: 'ఏజెంట్' ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా - అందుబాటులోకి వచ్చేది అప్పుడే!