బాలీవుడ్ నన్ను భరించలేదంటూ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నిర్మాత ముఖేష్ భట్ స్పందించారు. బుధవారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మహేష్ బాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అన్నారు. 


‘‘మహేష్ బాబు ధరను బాలీవుడ్ భరించలేదని అనుకుంటే, అది మంచిదే. ఆయనకు నా శుభాకాంక్షలు. ఆయన్ని నేను గౌరవిస్తాను. ఆయన ప్రతిభ ఉన్న నటుడు. ఆయన గత కొన్నేళ్లుగా సృష్టించిన ప్రతిభకు ఒక విలువ ఉంది. ఆయన విజయవంతమైన నటుడు కాబట్టి తన అవసరాలకు అనుకుగుణంగా ఉంటారు. బాలీవుడ్ ఆయన అంచనాలకు అనుగుణంగా పనిచేయలేకపోవచ్చు. ఇందులో ఆయన తప్పులేదు. అది ఆయన సొంత విషయం’’ అని అన్నారు. 
 
‘మేజర్’ ట్రైలర్ లాంచ్‌లో భాగంగా మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై స్పందించారు. ‘‘హిందీ ఇండస్ట్రీ నుంచి నాకు ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ వారు నన్ను భరించగలరని నేను అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పని చేయడం టైం వేస్ట్ చేసుకోవడమే అవుతుంది. ఇక్కడ(టాలీవుడ్) నాకు బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. పైగా ఈ ఇండస్ట్రీ నాకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ ఇచ్చింది. దీనిపట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే.. నా ఇండస్ట్రీని విడిచి మరేదో ఇండస్ట్రీకి వెళ్లి పని చేయాలనే ఆలోచన నాకు లేదు. సినిమాలు చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలని ఎప్పుడూ అనుకుంటాను. నా కల ఇప్పుడు నెరవేరుతోంది’’ అని అన్నారు.


Also Read: 'మురారి' ప్లేస్‌లో 'మ మ మహేశా', ముందు 'కళావతి' నచ్చలేదు - మహేష్


మహేష్ చేసిన వ్యాఖ్యలను నేషనల్ మీడియా సీరియస్‌గా తీసుకుంది. బాలీవుడ్‌పై మహేష్ బాబు తీవ్ర వ్యాఖ్యలంటూ దుమారం రేపాయి. దీంతో మహేష్ బాబు తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వక తప్పలేదు. ‘‘బాలీవుడ్‌పై ఎప్పుడూ నేను నెగటివ్ కామెంట్స్ చేయలేదు. అన్ని భాషలను నేను గౌరవిస్తా. నేను ఎప్పుడూ తెలుగు సినిమాలే చేస్తానని చెప్పను. అంతేగానీ బాలీవుడ్ సినిమాలు చేయనని చెప్పలేదు. మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌కు సైతం చేరుకోవాలనేదే నా కోరిక. పదేళ్లుగా నేను అనుకుంటున్నది ఇప్పుడు నెరవేరుతోంది. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయికి చేరాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఇండస్ట్రీ వదిలేసి అక్కడికి ఎందుకెళ్లాలి? అనేదే నా అభిప్రాయం. నేను ఇక్కడ హ్యాపీ. అక్కడికి వెళ్లాలనే ఆలోచన నాకు లేదు’’ అని పేర్కొన్నారు.


Also Read: ఆ నిర్ణయం నాది కాదు & గౌతమ్ వేరు, సితార వేరు! - పిల్లల గురించి మహేష్ బాబు ఏమన్నారంటే?