Mohan Lal's L2 Empuraan Controversial Scenes Trimmed: మలయాళ స్టార్ మోహన్ లాల్ 'లూసిఫర్ 2: ఎంపురాన్' (L2: Empuraan) మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithvi Raj Sukumaran) దర్శకత్వం వహించిన ఈ మూవీలో కొన్ని సీన్స్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై నిర్మాత గోకులం గోపాలన్ స్పందించారు 

ఆ సీన్స్ కట్

తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని.. వివాదానికి కారణమైన సీన్స్ తొలగించాలని చెప్పినట్లు గోపాలన్ తెలిపారు. 'ఎంపురాన్‌లో చూపించిన ఏదైనా సీన్ లేదా డైలాగ్ కొందరు మనోభావాలను దెబ్బతీసేలా ఉంటే వాటిని వెంటనే మార్చాలని దర్శకుడు పృథ్వీరాజ్‌కు చెప్పాను. ఇప్పటికే కొన్ని పదాలు మ్యూట్ చేశాం. అయితే కొన్ని సీన్స్‌పై వ్యతిరేకత వస్తుంది. వీలైతే వాటిని కూడా మార్చాలని చెప్పాను. ఒక సినిమా సెన్సార్ అనుమతి పొందిందంటే అందులో ఎలాంటి ఇబ్బందులు లేవనే అర్థం.' అని చెప్పారు.

'దాని కోసం ఎవరూ సినిమా చేయరు'

తాను పాలిటిక్స్‌ను ప్రజలకు సేవ చేసే మార్గంగానే చూస్తానని గోకులన్ అన్నారు. ఒకరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశంతో ఎవరూ సినిమాలు చేయరని.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకే సినిమాలు తీస్తారని తెలిపారు. 'సినిమా రిలీజ్ అయ్యాక ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే.. నిర్మాత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎంపురాన్ ప్రస్తుతం 4 వేల థియేటర్లలో ప్రదర్శితమవుతుంది. కాబట్టి సీన్స్ మార్చాలంటే దాదాపు రూ.40 లక్షల వరకూ ఖర్చు అవుతుందని అనుకుంటున్నా. ఆ సీన్స్ తొలగించాలని దర్శకునికి సూచించాను.' అని పేర్కొన్నారు.

Also Read: 'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు

ఈ సీన్స్‌పైనే అభ్యంతరం

ఈ మూవీలో 2002లో గుజరాత్‌లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో కొన్ని సీన్స్ చూపించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హతమార్చడం.. కొంతకాలానికి అతనే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం వంటి అంశాలతో సీన్స్ ఉండగా వాటిని కొందరు తప్పుబడుతున్నారు. ఓ వర్గాన్ని అవమానకరంగా, తక్కువ చేసి చూపించేలా ఆ సీన్స్ ఉన్నాయని విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు పృథ్వీరాజ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై మూవీ రచయిత మురళీ గోపీ స్పందించారు. ఓ సినిమాను తమకు నచ్చిన రీతిలో ఊహించుకునే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందని.. తాను మాత్రం ఈ విషయంలో సైలెంట్‌గా ఉంటానని అన్నారు. మరోవైపు, ఈ చిత్రాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) హిందూ వ్యతిరేక చిత్రంగా పేర్కొంది. అయితే, కాంగ్రెస్ మాత్రం ఈ మూవీకి మద్దతు ప్రకటించింది. 

రికార్డు కలెక్షన్లు

2019లో వచ్చిన 'లూసిఫర్' మూవీకి సీక్వెల్‌గా దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 'L2: ఎంపురాన్' తెరకెక్కించారు. ఈ నెల 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్ కాగా రూ.100 కోట్ల క్లబ్బులో చేరిన ఫాస్టెస్ట్ సినిమాగా చరిత్ర సృష్టించింది.